నూతన్ నాయుడుపై మరో రెండు కేసులు నమోదు
ABN , First Publish Date - 2020-09-12T17:42:04+05:30 IST
సినీ నిర్మాత, బిగ్ బాస్ ఫేమ్ నూతన్ నాయుడు ఇంట్లో దళిత యువకుడికి శిరోముండనం చేసిన ఘటన ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.

విశాఖపట్నం : సినీ నిర్మాత, బిగ్ బాస్ ఫేమ్ నూతన్ నాయుడు ఇంట్లో దళిత యువకుడికి శిరోముండనం చేసిన ఘటన ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసులో మొదట ఏడుగుర్ని అరెస్ట్ చేసిన పోలీసులు.. ఉడిపిలో నూతన్ను అరెస్ట్ చేశారు. అయితే నూతన్ లీలలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. ఇప్పటికే మాజీ ఐఏఎస్ పీవీ రమేష్ పేరిట బెదిరింపులకు కూడా పాల్పడ్డాడు. ఆ తర్వాత పలు విషయాలు కూడా వెలుగు చూశాయి.
తాజాగా.. నూతన్పై మరో రెండు అట్రాసిటీ కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో సెంట్రల్ జైల్ నుంచి మరోసారి విచారణకు గాను పోలీస్ స్టేషన్కు తీసుకురానున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఓ వ్యక్తికి బ్యాంకులో డైరెక్టర్ పోస్ట్ ఇప్పిస్తానంటూ రూ. 20 కోట్లు వసూలు చేసినట్లు తేలింది. మరోవైపు.. తెలంగాణకు చెందిన వ్యక్తికి ఆసుపత్రిలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ నాలుగు లక్షలు వసూలు చేసినట్లు కూడా తేలింది.
అయితే.. నాలుగు లక్షలు చెల్లించిన తర్వాత ఉద్యోగం రాకపోవడంతో నూతన్ను బాధితుడు ప్రశ్నించారు. తననే ప్రశ్నిస్తావా..? అంటూ ఆగ్రహానికి లోనైన నూతన్ సాగరతీరంలో హోటల్కు బాధితుడ్ని పిలిచి నోటికి వచ్చినట్లు దుర్భాషలాడాడు. పెందుర్తి శిరోముండనం కేసులో నూతన్ కుటుంబ అరాచకాలను ప్రసారమాధ్యమాల్లో చూడటంతో తమకు జరిగిన అన్యాయంపై పలువురు బాధితులు ఫిర్యాదు చేస్తున్నారు.