జగన్ సర్కార్‌కు బైరెడ్డి శబరి స్ట్రాంగ్ వార్నింగ్

ABN , First Publish Date - 2020-03-21T17:26:35+05:30 IST

వైసీపీ సర్కార్‌పై బీజేపీ నాయకురాలు, బైరెడ్డి శబరి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

జగన్ సర్కార్‌కు బైరెడ్డి శబరి స్ట్రాంగ్ వార్నింగ్

కర్నూల్: వైసీపీ సర్కార్‌పై బీజేపీ నాయకురాలు, బైరెడ్డి శబరి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తప్పుని తప్పని చెబితే వైసీపీ నేతలు తనను బెదిరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదేమైనా నియంతృత్వమా.. రాష్ట్రంలో అసలేం జరుగుతుందని ప్రశ్నించారు. ఓ వీడియో రిలీజ్ చేసిన శబరి.. ప్రభుత్వ తీరును ఎండగట్టారు. ‘‘తప్పుడు సమాచారం వస్తే.. డాక్టర్‌గా దాన్ని సరిచేయాల్సిన బాధ్యత నాకుంది. పారాసిటమాలే ట్రీట్‌మెంట్ అని సీఎం చెబుతున్నారు. అది జ్వరాన్ని మాత్రమే తగ్గిస్తుంది. ఈ కరోనా వైరస్‌ అంటే జ్వరం మాత్రమే కాదు. వేరే ఇన్ఫెక్షన్లు ఉంటాయి. ఇదే విషయాన్ని చాలా మర్యాదగా చెప్పాను. నేను ముందుకు వచ్చి మాట్లాడటం తప్పా... తప్పు జరిగితే ప్రశ్నించకూడదని ఏమైనా చెప్పారా? ఆరు గంటలకొకసారి 650 గ్రాముల చొప్పున అంటే 24 గంటల్లో దాదాపు 2.5 కేజీల పారాసిటమాల్ వేసుకోవాలి. ఇదేమైనా స్వీటా? మంచిది కాదు. పెద్ద స్థాయిలో ఉన్న మీలాంటి వారు చెబితే.. ప్రజలు గుడ్డిగా నమ్ముతారు. ఇంతవరకు నేను రాజకీయం చేయలేదు. ప్రజల కోసం ముందుకు వచ్చి మాట్లాడా. గౌరవంగా.. బాధ్యతాయుతంగా మాట్లాడా’’ అన్నారు. 


వైసీపీ నేతల బెదిరింపులను ప్రస్తావిస్తూ.. ‘‘చెప్పులతో కొడతామని బెదిరిస్తారా... మీ పార్టీలో ఉన్న వాళ్ల ఇళ్లలో కూడా స్త్రీలు ఉన్నారు. ఒక మహిళ గురించి అలా మాట్లాడకూడదన్నది తెలియదా.. ఇలాంటి రౌడీలకు పెత్తనం ఇస్తే ఇలాగే ఉంటుంది. మంచి చెబితే తప్పంటారా... ఎందుకండి మీరు... మహిళలపై విమర్శలు చేస్తే చట్టాలు ఎంత కఠినంగా  ఉన్నాయో తెలియదా? మహిళల గురించి ఒక్క మాట మాట్లాడినా... కామెంట్ చేసినా... ఐపీసీ సెక్షన్ 509 ప్రకారం.. మూడు సంవత్సరాలు జైలు శిక్ష. ఇదంతా అవగాహన లేదా? దమ్ముంటే ధైర్యంగా ముందుకు వచ్చి మాట్లాడండి. మీ కార్యకర్తలకు నేర్పించండి. మహిళలకు మాట్లాడే హక్కు లేదంటే.. మీ పార్టీలోని మహిళా ఎమ్మెల్యేలను, మంత్రులను రాజీనామా చేయించండి. రాజకీయాలు కొత్తేం కాదు. మా తాతల నుంచి రాజకీయాలను ఎన్నో చూశాం. డిప్యూటీ సీఎంలుగా పని చేశారు. నాకే ఇంత బెదిరింపులు వస్తుంటే... సాధారణ మహిళల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థమవుతుంది. సీఎం జగన్ గారూ.. మీరు వెంటనే యాక్షన్ తీసుకోండి. లేదంటే బీజేపీ నేతగా నేనే స్వయంగా యాక్షన్ తీసుకోవలసి ఉంటుంది’’ అంటూ ఘాటుగా హెచ్చరించారు.   

Updated Date - 2020-03-21T17:26:35+05:30 IST