అనంతపురం ప్రభుత్వాస్పత్రిలో నర్సుకు చికిత్స ప్రారంభం
ABN , First Publish Date - 2020-08-04T15:52:46+05:30 IST
అనంతపురం ప్రభుత్వాస్పత్రిలో నర్సుకు చికిత్స ప్రారంభం
అనంతపురం: కరోనా వైరస్తో ఊపిరి ఆడక తీవ్ర ఇబ్బందులకు గురైన నర్సుకు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందజేస్తున్నారు. నర్సును ఎస్కేయూ క్వారంటైన్ కేంద్రం నుంచి అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి...కోవిడ్ వార్డులో చికిత్సను ప్రారంభించారు.
గుంతకల్లు పట్టణానికి చెందిన ఓ నర్సు, ఆమె భర్త, కుమారుడికి కరోనా పాజిటివ్ అని తేలింది. ఊపిరి తీసుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న నర్సుకు భర్తే అంబులెన్స్లో ఉన్న ఆక్సిజన్తో ప్రాణాలు కాపాడేందుకు యత్నిస్తున్నారు. శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ క్వారన్టైన్ కేంద్రం వద్ద ప్రైవేటు ఆక్సిజన్ అంబులెన్స్కు ఏడు వేలు చెల్లించి మరీ నర్సుకు భర్త, కుమారుడు ఆక్సిజన్ అందించారు.
మొదట శ్వాస తీసుకోవడంలో తీవ్రంగా ఇబ్బంది పడుతుండడంతో గుంతకల్ నుంచి అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి నర్సు కుటుంబం వెళ్లింది. అయితే బెడ్లు లేవని... ఎస్కేయూ క్వారంటైన్ కేంద్రానికి వెళ్లాలని అక్కడి వైద్యులు సూచించారు. దీంతో ఎస్కేయూ క్వారంటైన్కు వెళ్లగా...అక్కడ ఆక్సిజన్ బెడ్స్తో పాటు డాక్టర్లు కూడా అందుబాటులో లేకుండా పోయారు. చివరకు నర్సును తిరిగి అనంత ప్రభుత్వాస్పత్రికి తరలించి...కోవిడ్ వార్డులో ఆమెకు చికిత్సను ప్రారంభించారు.