అమరావతి రైతులను అన్యాయంగా జైలులో పెట్టారు: రామకృష్ణ

ABN , First Publish Date - 2020-10-28T22:08:01+05:30 IST

అమరావతి రైతులను అన్యాయంగా జైలులో పెట్టారని సీపీఐ నేత రామకృష్ణ మండిపడ్డారు. ప్రభుత్వ అణచివేత పరాకాష్టకు చేరిందన్నారు.

అమరావతి రైతులను అన్యాయంగా జైలులో పెట్టారు: రామకృష్ణ

గుంటూరు: అమరావతి రైతులను అన్యాయంగా జైలులో పెట్టారని సీపీఐ నేత రామకృష్ణ మండిపడ్డారు. ప్రభుత్వ అణచివేత పరాకాష్టకు చేరిందన్నారు. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని సీఎం జగన్ దుర్వినియోగం చేస్తున్నారని, రైతులకు పోటీగా ఇతర ప్రాంతాల వారిని తీసుకొచ్చి... పెయిడ్ ఉద్యమం నడిపించటం దారుణమన్నారు. ఎస్సీ, ఎస్టీ రైతులపైనే అట్రాసిటీ చట్టం కింద కేసులు పెట్టడం దేశంలోనే తొలిసారన్నారు. రైతులకు బేడీలు వేయటంతోనే ప్రభుత్వానికి పోయే కాలం వచ్చిందని రామకృష్ణ హెచ్చరించారు.


అమరావతి ప్రాంత రైతులపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారు. ఏడుగురు రైతులను పోలీసులు మంగళవారం నరసరావుపేట సబ్‌ జైలు నుంచి గుంటూరు జైలుకు తరలించారు. ఇద్దరిద్దరికి చొప్పున చేతులకు బేడీలు వేసి మరీ రిమాండుకు పంపించారు. కరుడుగట్టిన నేరస్తులు, బందిపోటు దొంగలు, తీవ్రవాదులు, రౌడీషీటర్లు, శిక్ష పడిన ఖైదీలకు భద్రతా కారణాల దృష్ట్యా చేతులకు బేడీలు వేస్తుంటారు. కొన్ని ప్రత్యేక కేసుల్లో కోర్టు అనుమతి తీసుకుని బేడీలు వేయటం సహజంగా జరుగుతుంది. అయితే... ఇప్పుడు రాజధాని రైతులకు బేడీలు వేశారు. ఇది మానవ హక్కుల ఉల్లంఘనేనని హక్కుల సంఘాల నాయకులు, న్యాయవాదులు పేర్కొంటున్నారు.

Updated Date - 2020-10-28T22:08:01+05:30 IST