దుర్గగుడి ఉద్యోగుల్లో అన్యమతస్థులు
ABN , First Publish Date - 2020-10-04T08:21:32+05:30 IST
దుర్గమ్మ గుడిలో కొంతమంది ఉద్యోగులు హిందూయేతర మతాచారాలను పాటిస్తున్నారని హిందూ యువశక్తి ప్రతినిధులు ఆధారాలతో సహా బయట పెట్టారు.
ఓ ఉద్యోగిని ఫేస్బుక్ ఖాతాలో క్రిస్మస్ ట్రీ, శాంతాక్లాజ్ చిత్రాలు
ఇద్దరు ఉద్యోగినులను నిలదీసిన హిందూ యువశక్తి ప్రతినిధులు
డిక్లరేషన్ ఇచ్చామన్న ఉద్యోగినులు
విజయవాడ, అక్టోబరు 3(ఆంధ్రజ్యోతి): దుర్గమ్మ గుడిలో కొంతమంది ఉద్యోగులు హిందూయేతర మతాచారాలను పాటిస్తున్నారని హిందూ యువశక్తి ప్రతినిధులు ఆధారాలతో సహా బయట పెట్టారు. దేవస్థానానికి చెందిన మాడపాటి సత్రంలో శానిటరీ ఇన్స్పెక్టరుగా పనిచేస్తున్న మేరీ స్వరూపరాణి, శృంగేరీ మఠం వద్ద విధులు నిర్వహిస్తున్న శానిటరీ ఇన్స్పెక్టర్ రజినీప్రియ దుర్గగుడిలో రెగ్యులర్ ఉద్యోగులు. వీరిద్దరినీ యువశక్తి రాష్ట్ర అధ్యక్షుడు చిక్కాల రజనీకాంత్ తదితరులు శనివారం నిలదీశారు.
క్రైస్తవ మతానికి చెందిన పేరే అయినా, తాను హిందువునని, ఆ మేరకు దేవస్థానంలో డిక్లరేషన్ కూడా ఇచ్చానని మేరీ స్వరూపరాణి చెప్పారు. అలాగే రజినీప్రియ ఫేస్బుక్ ఖాతాలో ప్రొఫైల్ చిత్రంగా క్రిస్మస్ ట్రీ, శాంతాక్లాజ్, కవర్ ఫొటోగా బైబిల్లోని వాక్యాలతో కూడిన చిత్రాలు ఉన్నాయి. దీనిపై దుర్గగుడి ఈవో సురేశ్బాబుకు ఫిర్యాదు చేసేందుకు తాము వెళితే ఆయన ముఖం చాటేశారని రజనీకాంత్ చెప్పారు.