బంగారం లాంటి భూములిచ్చాం!
ABN , First Publish Date - 2020-05-24T08:12:07+05:30 IST
‘రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుందంటే నమ్మి మేలిమి బంగారం లాంటి భూములిచ్చాం. ఇక్కడి పరిస్థితుల గురించి తెలియకుండా ఒక పార్టీపై ఉన్న దురభిమానంతో మాపై సోషల్ మీడియా...

మమ్మల్ని నానా రకాల మాటలంటున్నారు
158వ రోజు అమరావతి రైతుల ఆందోళనలు
గుంటూరు, మే 23(ఆంధ్రజ్యోతి): ‘రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుందంటే నమ్మి మేలిమి బంగారం లాంటి భూములిచ్చాం. ఇక్కడి పరిస్థితుల గురించి తెలియకుండా ఒక పార్టీపై ఉన్న దురభిమానంతో మాపై సోషల్ మీడియా వేదికగా కొందరు నానా మాటలు అంటున్నారు. ఒక్కసారి ఇక్కడికి వచ్చి మా పరిస్థితులు చూసి మాట్లాడండి’ అంటూ రాజధాని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర పాలనంతా అమరావతి నుంచే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఆ ప్రాంత రైతులు చేస్తోన్న ఆందోళనలు శనివారానికి 158వ రోజుకు చేరాయి. ‘భావితరాల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని బంగారం పండే లంక భూములను ప్రభుత్వానికి ఇచ్చాం. ఇప్పుడవి మట్టి, కాంక్రీట్ దిబ్బలుగా మారిపోయాయి. మా గురించి వైసీపీ ప్రభుత్వం కనీసం పట్టించుకోవటం లేదు’ అంటూ రైతులు కన్నీటి పర్యంతం అయ్యారు. ఊపిరి ఉన్నంత వరకు గాంధేయ మార్గంలో పోరు కొనసాగిస్తామన్నారు. అలాగే, రాజధాని ప్రాంతంలోని దళితులను సీఎం జగన్ నమ్మించి మోసం చేశారంటూ దళిత జేఏసీ నేతలు ఆరోపించారు. హైకోర్టు లేకపోతే మా పరిస్థితి ఏమిటని ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతి వెలుగు కార్యక్రమం కింద రాత్రి 7.30 గంటలకు విద్యుత్ దీపాలు ఆర్పి కొవ్వొత్తులు, దీపాలు వెలిగించి మహిళలు, రైతులు ‘సేవ్ అమరావతి..సేవ్ ఆంధ్రప్రదేశ్’ అంటూ నినాదాలు చేశారు.