బతుకులు చితికి పోతున్నాయి
ABN , First Publish Date - 2020-05-17T09:55:05+05:30 IST
మూడు రాజధానులంటూ ప్రభుత్వం తీసుకున్న ఏకపక్ష నిర్ణయంతో తమ బతుకలు చితికిపోతున్నాయని రాజధాని రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.

ప్రభుత్వమే అన్యాయం చేస్తే ఎలా?
151వ రోజు కొనసాగిన అమరావతి రైతుల అందోళనలు
గుంటూరు, మే 16(ఆంధ్రజ్యోతి): మూడు రాజధానులంటూ ప్రభుత్వం తీసుకున్న ఏకపక్ష నిర్ణయంతో తమ బతుకలు చితికిపోతున్నాయని రాజధాని రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. పాలనంతా అమరావతి నుంచే కొనసాగించాలంటూ ఆ ప్రాంత రైతులు చేస్తోన్న ఆందోళనలు శనివారానికి 151వ రోజుకు చేరాయి.ప్రభుత్వం అనాలోచితంగా తీసుకున్న నిర్ణయంతో ఆర్థికంగాను, మానసికంగాను కుంగిపోయామని.. పిల్లల చదువులకు ఫీజులు కట్టలేకపోతున్నామని, కుదిరన సంబంధాలు వెనక్కిపోతున్నాయని ఫలితంగా పెళ్లిళ్లు చేయలేకపోతున్నామంటూ కన్నీరుమున్నీరు అవుతున్నారు.
నాడు రాష్ట్ర భవిష్యత్తు కోసం భూములు ఇస్తే, నేడు తమ భవిష్యత్తు ప్రశ్నార్ధకం అయ్యిందంటూ రైతులు ఎవరి ఇళ్లలో వారు వివిధ రూపాల్లో నిరసన తెలిపారు. అమరావతి వెలుగు కింద రాత్రి 7.30 నుంచి అరగంట పాటు ఇళ్లలోని విద్యుత్ దీపాలు అర్పీ కొవ్వొత్తులు, దీపాలు వెలిగించి జై అమరావతి, సేవ్ ఆంధ్రప్రదేశ్ నినాదాలు చేశారు. రాజధాని రైతులకు మద్దతుగా తాడికొండ మండలం పొన్నెకల్లు, మోతడక గ్రామాల్లో రైతులు ఆందోళన చేపట్టారు.