అమరావతిపై అబద్ధాల ప్రచారం

ABN , First Publish Date - 2020-10-01T08:57:49+05:30 IST

సొంత మీడియా చేతిలో ఉందని ఇష్టానుసారంగా అమరావతిపై అబద్ధాలు ప్రచారం చేస్తున్నారంటూ రాజధాని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిపాలనా రాజధానిగా అమరావతిని కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ ఆ ప్రాంత రైతులు చేస్తోన్న ఆందోళనలు...

అమరావతిపై అబద్ధాల ప్రచారం

  • రోడ్లపై చుక్క నీరు చూపాలని రైతుల సవాల్‌
  • 288వ రోజు కొనసాగిన రాజధాని ఆందోళనలు

గుంటూరు, సెప్టెంబరు 30(ఆంధ్రజ్యోతి): సొంత మీడియా చేతిలో ఉందని ఇష్టానుసారంగా అమరావతిపై అబద్ధాలు ప్రచారం చేస్తున్నారంటూ రాజధాని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిపాలనా రాజధానిగా అమరావతిని కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ ఆ ప్రాంత రైతులు చేస్తోన్న ఆందోళనలు బుధవారం 288వ రోజుకు చేరాయి. సచివాలయ ప్రాంతంలో, సీడ్‌ యాక్సిస్‌ రోడ్లపై చుక్క నీరైనా చూపండి అంటూ పాలకులకు సవాల్‌ చేస్తూ రైతులు ప్లకార్డులు ప్రదర్శించారు.


వెలగపూడి, తుళ్లూరు, మందడం, బోరుపాలెం, అనంతవరం, నీరుకొండ, పెదపరిమి, బేతపూడి, పెనుమాక, ఎర్రబాలెం, లింగాయపాలెం, కృష్ణాయపాలెం తదితర గ్రామాల్లో మహిళలు మహాధర్నాను కొనసాగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజధానికి రైతులు భూములిచ్చినప్పుడు నాటి ప్రభుత్వం భార్యాభర్తలిద్దరికీ దుస్తులు, భోజనం పెట్టి ఎంతో గౌరవంగా పంపించిందని గుర్తుచేశారు. ప్రస్తుత ప్రభుత్వం పోలీసుల ద్వారా లాఠీలతో కొట్టిస్తోందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్ని కుటిల యత్నాలు చేసినా ఆందోళనలు కొనసాగిస్తామని తేల్చి చెప్పారు. అమరావతే ఏకైక రాజధాని అని సీఎం నోటి నుంచి వచ్చే వరకు తమ పోరు ఆపేది లేదంటూ మహిళలు అమరావతి వెలుగు కార్యక్రమాన్ని కొనసాగించారు.


Updated Date - 2020-10-01T08:57:49+05:30 IST