మూడు రాజధానులంటేనే మోసం
ABN , First Publish Date - 2020-08-01T09:11:20+05:30 IST
‘‘మూడు రాజధానులంటేనే మోసం. 151మంది ఎమ్మెల్యేలు గెలిచినంత మాత్రాన ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసేందుకు వీల్లేదు’’ అని వైసీపీ ఎంపీ రఘురామ
![మూడు రాజధానులంటేనే మోసం](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
- వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు
(ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్వర్క్): ‘‘మూడు రాజధానులంటేనే మోసం. 151మంది ఎమ్మెల్యేలు గెలిచినంత మాత్రాన ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసేందుకు వీల్లేదు’’ అని వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు వ్యాఖ్యానించారు. మూడు రాజధానుల ద్వారానే అభివృద్ధి జరుగుతుందనడం సరికాదన్నారు. ఇప్పటివరకూ అమరావతి ప్రాంత రైతులు మాత్రమే ఆందోళన చేస్తున్నారు. ఇప్పుడు రాష్ట్రమంతా ఏకమై అమరావతిని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. విశాఖవాసులకు కూడా పాలనా రాజధాని రావడం ఇష్టం లేదన్నారు. మూడు రాజధానుల బిల్లులను గవర్నర్ ఆమోదించినా న్యాయస్థానంలో చెల్లుబాటుకాదన్నారు. ప్రజాభిప్రాయ వ్యతిరేక నిర్ణయానికి ప్రధాని మోదీ మద్దతు ఇస్తారని భావించడం లేదన్నారు.
గవర్నర్ నిర్ణయం క్విడ్ ప్రోకోలా ఉంది: సీపీఐ నారాయణ
గవర్నర్ నిర్ణయం క్విడ్ ప్రో కోలా ఉందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. ఇందంతా బీజేపీ ఆడిస్తున్న నాటకమన్నారు. కన్నాను బీజేపీ అధ్యక్ష పదవి నుంచి తొలగించి సోము వీర్రాజును నియమించి మార్గం సుగమం చేసుకుందని అరోపించారు. రాజధాని విషయంలో కేంద్రం ఆడుతున్న డ్రామాలు కట్టిపెట్టాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ బీజేపీకి సూచించారు.
బిల్లులను ఆమోదించడం గర్హనీయం: సీపీఎం మధు
వివిధ రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, రైతులు, ప్రజలు వ్యతిరేకతను పరిగణలోకి తీసుకోకుండా గవర్నర్ బిల్లులను ఆమోదించడం గర్హనీయమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు అన్నారు.
దేశ రెండో రాజధానిగా అమరావతి: టీజీ డిమాండ్
అంబేడ్కర్ కలలు సాకారం కావాలంటే దేశ రెండో రాజధానిగా అమరావతిని ఏర్పాటుకు ముందుకొస్తే మద్దతిస్తామని బీజేపీ నేత, రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్ అన్నారు. రాయలసీమలో జ్యుడీషయల్ రాజధానిని స్వాగతిస్తున్నామన్నారు.