అసలు ఇవి పాలా? విషమా? ప్లాస్టిక్ ముద్దా?

ABN , First Publish Date - 2020-05-29T19:25:36+05:30 IST

ద్వారక తిరుమల మండలం, బుట్టాయిగూడెం కాలనీలో కల్తీ పాలు కలకలం నెలకొంది.

అసలు ఇవి పాలా? విషమా? ప్లాస్టిక్ ముద్దా?

ప.గో.జిల్లా: ద్వారక తిరుమల మండలం, బుట్టాయిగూడెం కాలనీలో కల్తీ పాలు కలకలం నెలకొంది. స్థానిక అన్నపూర్ణ డైరీ వద్ద పాలు కొనుగోలు చేసి వాటిని వేడిచేస్తే ప్లాస్టిక్ ముద్దలా తయారై పట్టుకుంటే దారంలా సాగుతోందని అక్కడ పాలు కొన్న మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. బుట్టాయిగూడెం కాలనీలో నివాసం ఉంటున్న సుమలత అనే మహిళ నిన్న సాయంత్రం లీటరు పాలు కొనుగోలు చేసింది. రాత్రి కొన్ని పాలు వేడి చేసి  తన 7 నెలల బాబుకు పట్టించి మిగిలిన పాలను తెల్లవారుజామున వాడుకుందామనే ఉద్దేశంతో డబ్బాలో పోసి ఉంచారు. అయితే ఇవాళ ఉదయం పాలు గిన్నెలో పోసేసరికి పాలలోంచి ఓ ముద్ద గిన్నెలో పడింది. పాలు ఇలా ఎందుకున్నాయో అర్థం కాక పాలు వేడిచేసింది. దీంతో ఆ పాలు ముద్దలా తయారై ప్లాస్టిక్‌లా సాగుతూ కనిపించాయి.


దీంతో భయపడిన మహిళ పాలు అమ్మిన వ్యక్తికి ఫోన్ చేసి జరిగిన విషయం తెలిపింది. అయితే అతను నిన్న చాలా మంది పాలు తీసుకువెళ్లారని, మీరు మాత్రమే ఇలా చెబుతున్నారని, వెంటనే ఆ పాలు పారబోయమని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారని ఆమె తెలిపింది. ఇలాంటి కల్లీ పాలు అమ్మేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితురాలు వాపోయింది. దీంతో స్థానికులు ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేశారు.

Updated Date - 2020-05-29T19:25:36+05:30 IST