నేటి వరకు ఆప్షన్ గడువు: మంత్రి సురేష్
ABN , First Publish Date - 2020-12-17T14:04:56+05:30 IST
నేటి వరకు ఆప్షన్ గడువు: మంత్రి సురేష్

అమరావతి, (ఆంధ్రజ్యోతి): ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించిన ‘వెబ్ ఆప్షన్’ ప్రక్రియ గడువును గురువారం వరకు పొడిగించినట్టు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ ప్రకటించారు. సీపీఎ్సకు సంబంధించి ప్రభుత్వ కార్యాచరణ కొనసాగుతోందని ‘అక్యూరల్ ఫర్మ్’ కమిటీ రిపోర్టు ప్రభుత్వ పరిశీలనలో ఉందని బుధవారం ఆయన తెలిపారు. కాగా, బుధవారం మధ్యాహ్నం 2 గంటల వరకు 71,947 మంది టీచర్లు (95శాతం) వెబ్ ఆప్షన్ను వినియోగించుకున్నట్టు తెలిపారు. ఉపాధ్యాయ సంఘాలతో చర్చించాకే బదిలీల జీవోలను ప్రభుత్వం జారీ చేసిందన్నారు. ఈ నెల 20న ‘జగనన్న అమ్మఒడి’ తుది జాబితా పోర్టల్ పెడతామన్నారు. టీచర్ల బదిలీల వ్యవహారాన్ని రాజకీయాలకు వాడుకోవొద్దని టీడీపీ అధినేత చంద్రబాబుకు మంత్రి సూచించారు.
టీచర్లకు జగన్ క్షమాపణ చెప్పాలి..చంద్రబాబు డిమాండ్
ఉపాధ్యాయులపై పోలీస్ల దౌర్జన్యం, అరెస్టులకు సీఎం జగన్ బహిరంగ క్షమాపణ చెప్పాలని టీడీపీ అధినేత చంద్రబాబు బుధవారం ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. విజయవాడలో ప్రకాశం బ్యారేజి వద్ద జరిగిన ఉపాధ్యాయులపై దౌర్జన్యం, అరెస్టులను ఖండించారు. ఉపాధ్యాయ బదిలీల్లో రాజకీయ ప్రమేయం లేకుండా చేసేందుకు తమ ప్రభుత్వం కౌన్సిలింగ్ విధానాన్ని తెచ్చిందని బాబు గుర్తు చేశారు. ఇప్పుడు వైసీపీ నేతల జోక్యం పెరిగిపోయిందని విమర్శించారు. అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో సీపీఎ్సను రద్దు చేస్తానన్న జగన్ ఇంతవరకు దాని ఊసు ఎత్తడం లేదని దుయ్యబట్టారు. అరెస్టు చేసిన ఉపాధ్యాయులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.