అచ్చెన్న అనారోగ్యంపై జాలి కూడా చూపలేదు: న్యాయవాది హరిబాబు
ABN , First Publish Date - 2020-06-26T02:15:41+05:30 IST
ఏసీబీ కస్టడీలో అచ్చెన్నాయుడుకు తొలిరోజు విచారణ ముగిసిందని ఆయన తరపు న్యాయవాది...

గుంటూరు: ఏసీబీ కస్టడీలో అచ్చెన్నాయుడుకు తొలిరోజు విచారణ ముగిసిందని ఆయన తరపు న్యాయవాది మాగులూరి హరిబాబు తెలిపారు. అచ్చెన్నాయుడు ఆరోగ్యం బాగోలేకపోయినా ఏసీబీ అధికారులు జాలి కూడా చూపలేదన్నారు. టెలిహెల్త్కు సంబంధించి విచారణ జరిగిందని చెప్పారు. కొండను తవ్వి ఎలుకను పట్టినట్లుగా ఉందని హరిబాబు వ్యాఖ్యానించారు. అచ్చెన్నాయుడును విచారణ పేరుతో ఇంతగా ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదన్నారు. సమయపాలన లేకుండా ఇష్టానుసారంగా విచారణ చేస్తున్నారని తెలిపారు. ఆరోగ్యం బాగోలేకపోయినా జీజీహెచ్ వైద్యులు డిశ్చార్జ్ చేసేందుకు ప్రయత్నించారని, మాజీ మంత్రి పట్ల ఇలా వ్యవహరించడం సరికాదని హరిబాబు సూచించారు.
కాగా ఈఎస్ఐ నిధుల దుర్వినియోగం కేసులో మాజీ మంత్రి అచ్చెన్నాయుడును ఏసీబీ అధికారులు విచారించారు. జీజీహెచ్లో అచ్చెన్నను కస్టడీలోకి తీసుకున్న అధికారులు దాదాపు మూడు గంటలపాటు ప్రశ్నించారు. డీఎస్పీ ప్రసాద్ ఆధ్వర్యంలో తొలిరోజు విచారణ ముగిసింది. శుక్రవారం, శనివారం కూడా ఏసీబీ అధికారులు అచ్చెన్నను విచారించనున్నారు.
ఆస్పత్రిలోనే అచ్చెన్నను ప్రశ్నించాలన్న కోర్టు ఆదేశాల మేరకు గురువారం సాయంత్రం 5 గంటలకు ఏసీబీ అధికారులు గుంటూరు జీజీహెచ్కు వెళ్లారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ను కలిసిన తర్వాత అచ్చెన్నను కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించారు.