కుళ్లిన మాంసం తిని.. 90 మందికి అస్వస్థత
ABN , First Publish Date - 2020-07-10T09:18:23+05:30 IST
లోయలో పడి చనిపోయిన ఆవును రెండు రోజుల తర్వాత వండుకుతిన్న 90 మంది గిరిజనులు అస్వస్థతకు గురయ్యారు. ఆస్పత్రికి తరలించడంతో

- విశాఖ ఏజెన్సీలో ఘటన
జి.మాడుగుల(విశాఖ జిల్లా), జూలై 9: లోయలో పడి చనిపోయిన ఆవును రెండు రోజుల తర్వాత వండుకుతిన్న 90 మంది గిరిజనులు అస్వస్థతకు గురయ్యారు. ఆస్పత్రికి తరలించడంతో కోలుకుంటున్నారు. విశాఖపట్టణం జిల్లా పాడేరు డివిజన్ జి.మాడుగుల మండలం గడుతూరు పంచాయతీ మగతపాలెంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామంలోని ఓ రైతుకు చెందిన ఆవు ఈ నెల 6న సమీప అటవీ ప్రాంతంలో మేతకు వెళ్లి లోయలో జారి పడి మృతిచెందింది. గ్రామస్థులు గుర్తించి మరుసటిరోజు మధ్యాహ్నానికి దాని కళేబరాన్ని గ్రామానికి చేర్చారు. దాన్ని కోసుకొని, మాంసాన్ని 40 కుటుంబాలవారు పంచుకున్నారు. ఆ రోజు రాత్రి, మరుసటి రోజు ఉదయం ఆ మాంసాన్ని వండుకు తిన్నారు. దీంతో వారంతా జ్వరం, కడుపు నొప్పు, వాంతులు, విరోచనాలతో ఇబ్బంది పడ్డారు. మారుమూల గ్రామం కావడంతోపాటు అవగాహన లేమితో బాధితులెవరూ ఆస్పత్రికి వెళ్లలేదు.
ఇతరుల ద్వారా విషయం తెలుసుకున్న డిప్యూటీ తహసీల్దారు అప్పలస్వామి బుధవారం అర్ధరాత్రి ఆ గ్రామానికి వెళ్లారు. సుమారు 70 మంది బాధితులను అంబులెన్సుల్లో గురువారం తెల్లవారుజామున జి.మాడుగుల ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్న ఐదుగురిని పాడేరులోని జిల్లా ఆస్పత్రికి తరలించగా, సాయంత్రానికి కోలుకున్నట్టు వైద్యాధికారులు తెలిపారు. కాగా, గురువారం మధ్యాహ్నం మరో 20 మంది అస్వస్థతకు గురవడంతో వారిని కూడా జి.మాడుగుల ఆస్పత్రికి తరలించారు. ఏడీఎంహెచ్వో లీలా ప్రసాద్ గ్రామానికి చేరుకొని వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు.