అక్రమ ఇసుకలో 81 మందికి వాటాలు
ABN , First Publish Date - 2020-03-02T09:09:17+05:30 IST
రాష్ట్రంలో అక్రమ ఇసుక తరలింపులో 81 మంది వైసీపీ నేతలకు ప్రమేయముందని టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ విమర్శించారు. వారిపై చర్యలెందుకు తీసుకోవడం లేదని ప్రశ్నిస్తూ సీఎం జగన్కు ఆయన లేఖ...
![అక్రమ ఇసుకలో 81 మందికి వాటాలు](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
- జగన్కు టీడీపీ ఎమ్మెల్యే సత్యప్రసాద్ లేఖ
అమరావతి, మార్చి 1(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో అక్రమ ఇసుక తరలింపులో 81 మంది వైసీపీ నేతలకు ప్రమేయముందని టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ విమర్శించారు. వారిపై చర్యలెందుకు తీసుకోవడం లేదని ప్రశ్నిస్తూ సీఎం జగన్కు ఆయన లేఖ రాశారు. ‘రాష్ట్రంలో ఇసుక మాఫియాని వైసీపీకి చెందిన 67 మంది ఎమ్మెల్యేలు, 10 మంది మంత్రులు, నలుగురు ఎంపీలు ప్రత్యక్షంగా ప్రోత్సహిస్తూ వారి వాటాలు వారు తీసుకుంటున్నారు.
అక్రమాలు సహించబోమన్న మీరు వాళ్లపై చర్యలేవీ తీసుకోవడం లేదు. కనీసం కేసులు కూడా నమోదు చేయలేదు. అధికారులను మీ మాఫియా బెదిరిస్తున్నా.. మీరు పట్టించుకోవడం లేదు. మీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలే వారికి అండగా నిలుస్తున్నారు’ అని లేఖలో పేర్కొన్నారు. ఇసుక అక్రమాలపై చర్యలు తీసుకుంటామంటూ ప్రభుత్వం ఇచ్చిన టోల్ఫ్రీ నంబర్కు ఎన్ని ఫిర్యాదులు చేసినా పట్టించుకున్న దాఖలాలు లేవని ఆరోపించారు.