53 ఇంజనీరింగ్ కాలేజీల అఫిలియేషన్ రద్దు?
ABN , First Publish Date - 2020-08-22T09:45:15+05:30 IST
పనితీరు ప్రదర్శించని, నిర్వహణ సక్రమంగా లేని, అడ్మిషన్లు అంతంతమాత్రమైనా లేని ఇంజనీరింగ్ కాలేజీలపై కొరడా ఝుళిపించేందుకు ..
ఉన్నత విద్యాశాఖ - రెగ్యులేటరీ కమిషన్ కసరత్తు
(అమరావతి - ఆంధ్రజ్యోతి): పనితీరు ప్రదర్శించని, నిర్వహణ సక్రమంగా లేని, అడ్మిషన్లు అంతంతమాత్రమైనా లేని ఇంజనీరింగ్ కాలేజీలపై కొరడా ఝుళిపించేందుకు ఉన్నత విద్యాశాఖ - రెగ్యులేటరీ కమిషన్లు కసరత్తు ప్రారంభించాయి. తాజా సమాచారం ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 53 కాలేజీల అఫిలియేషన్ను రద్దు చేయించడంతో పాటు అడ్మిషన్ల కౌన్సెలింగ్ జాబితా నుంచి వాటిని తొలగించాలని భావిస్తున్నాయి. తమ కాలేజీలకు అడ్మిషన్లు అవసరం లేదంటూ ఆరు ఇంజనీరింగ్ కాలేజీల యాజమాన్యాలు తాజాగా లేఖలు సమర్పించాయి. అరకొర అడ్మిషన్లతో కాలేజీలను నిర్వహించలేమంటూ చేతులెత్తేశాయి. దీంతో ఆయా కాలేజీల అఫిలియేషన్ రద్దు చేయడంతో పాటు అడ్మిషన్ల కౌన్సెలింగ్ నుంచి కూడా వాటిని తొలగించాలని నిర్ణయించారు. గత విద్యా సంవత్సర గణాంకాల ప్రకారం రాష్ట్రంలో 287 ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు నడుస్తుండగా.. 2020-21 విద్యా సంవత్సరం ఫీజు ఫిక్సేషన్ కాలేజీల జాబితా నుంచి సదరు ఆరు కాలేజీలను తొలగించి మిగిలిన 281 కాలేజీలకే అడ్మిషన్లు చేపట్టాలని భావిస్తున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా 47 ఇంజనీరింగ్ కాలేజీల్లో 25 శాతానికి లోపే అడ్మిషన్లు ఉన్నట్లు గుర్తించారు. కానీ ఆదాయ వ్యయాలపై తప్పుడు నివేదికలిచ్చాయి. ఇలాంటి కాలేజీలపై తనిఖీలు చేసి, గతంలో వారు సమర్పించిన నివేదికల్లో తప్పులుంటే,అఫిలియేషన్ రద్దు చేయాలని రెగ్యులేటరీ కమిషన్ తాజాగా సంబంధిత విశ్వవిద్యాలయాలకు లేఖలు రాసింది. చట్ట పరమైన చర్యలకు వీలుగా సదరు 47 కాలేజీల జాబితాను పంపించింది. దీంతో విశ్వవిద్యాలయాలు తమ ప్రొఫెసర్లతో ఆయా కాలేజీల్లో తనిఖీలు ప్రారంభించాయి. 2019-20 విద్యా సంవత్సరానికి సంబంధించి రెగ్యులేటరీ కమిషన్ నియమించిన కమిటీలు ఇచ్చిన నివేదికలకు, ఇప్పుడు వర్సిటీల ఆధ్వర్యంలో జరుగుతున్న కమిటీల నివేదికలకు భారీగా వ్యత్యాసాలున్నట్లు తేలితే ఆయా ప్రొఫెసర్లపై చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారు. అలాగే కొన్నేళ్లుగా పనితీరు కనబరచని ఆయా కాలేజీలను 2020-21 విద్యా సంవత్సరపు అడ్మిషన్ల కౌన్సెలింగ్ జాబితా నుంచి తొలగించేందుకు ఉన్నత విద్యాశాఖ- రెగ్యులేటరీ కమిషన్లు రంగం సిద్ధం చేస్తున్నాయి. పనిలో పనిగా గత ప్రభుత్వ హయాంలో అత్యధిక ఫీజులు ఫిక్స్ అయిన పలుఇంజనీరింగ్ కాలేజీలపైనా ప్రభుత్వం ఆరా తీస్తోంది. ముఖ్యంగా ఏఎ్ఫఆర్సీ సిఫారసు చేసిన ఫీజులనే వర్తింపజేయాలంటూ కోర్టులకు వెళ్లిన కాలేజీల యాజమాన్యాలపై ఏదో విధంగా చర్యలు తీసుకోవాలన్న ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.