ఉసురుతీసిన లాక్డౌన్
ABN , First Publish Date - 2020-05-19T08:50:37+05:30 IST
గుంటూరు జిల్లా పిడుగురాళ్ల పట్టణం ప్రజాశక్తినగర్లో నివసించే కుండిపర్తి విశ్వరూపాచారి(60) స్వగ్రామం రాజుపాలెం మండలం ..

పిడుగురాళ్ల, మే 18: గుంటూరు జిల్లా పిడుగురాళ్ల పట్టణం ప్రజాశక్తినగర్లో నివసించే కుండిపర్తి విశ్వరూపాచారి(60) స్వగ్రామం రాజుపాలెం మండలం అంచులవారిపాలెం. భార్యతో మనస్పర్థలు రావడంతో ఆయన కుటుంబానికి దూరంగా పిడుగురాళ్ల వచ్చి చిన్న, చితకా పనులు చేసుకుంటూ జీవనంసాగించేవారు.
లాక్డౌన్ వల్ల గడిచిన 50 రోజులుగా పనులు దొరక్క తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అప్పుడప్పుడు దాతలు ఇచ్చిన ఆహార పోట్లాలతో కడుపునింపుకొన్నారు. కొన్ని రోజులు ఒంటిపూట భోజనంతో కాలం వెళ్లదీయడంతో బాగా నీరసించిపోయారు. పోస్టాఫీసులో దాచుకున్న కొద్దిపాటి నగదు తెచ్చుకుందామని మిత్రుడి సాయంతో సోమవారం పట్టణలోని పోస్టాఫీసుకు వచ్చారు. విత్డ్రా పత్రాలపై సంతకం చేశారు. పై అంతస్తులో ఉన్న కార్యాలయంలో ఆ పత్రాలు అందజేసేందుకు మెట్లు ఎక్కలేక పక్కనే బండపై కూర్చొని ఆయన కుప్పకూలిపోయారు. మిత్రుడు సపర్యలు చేస్తుండగానే విశ్వరూపాచారి తుదిశ్వాస విడిచారు.