వలస కూలీలకు రోజూ 10 రైళ్లు

ABN , First Publish Date - 2020-05-18T10:11:44+05:30 IST

రాష్ట్రం మీదుగా సొంత ప్రాంతాలకు కాలి నడకన వెళ్తున్న 4661 మంది వలస కూలీలను గుర్తించి ఈ నెల 14వ తేదీ నుంచి 62 పునరావాస కేంద్రాలకు

వలస కూలీలకు రోజూ 10 రైళ్లు

  • పునరావాస కేంద్రాల్లో 4600 వేల మంది 
  • చెక్‌పోస్టుల వద్ద ఆర్టీసీ బస్సులు: కృష్ణబాబు

విజయవాడ, మే 17 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రం మీదుగా సొంత ప్రాంతాలకు కాలి నడకన వెళ్తున్న 4661 మంది వలస కూలీలను గుర్తించి ఈ నెల 14వ తేదీ నుంచి 62 పునరావాస కేంద్రాలకు తరలించామని రాష్ట్ర కొవిడ్‌ కంట్రోల్‌ కో ఆర్డినేటర్‌ ఎంటీ కృష్ణబాబు తెలిపారు. ఆదివారం ఆయన విజయవాడ ఆర్‌ అండ్‌ బీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ప్రతి చెక్‌పోస్టు వద్ద వలస కూలీలకు కౌన్సెలింగ్‌ ఇప్పించి పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం పునరావాస కేంద్రాల్లో ఉన్నవారిలో 485 మంది ఏపీవాసులు కాగా, మిగిలినవారు ఒడిసా, యూపీ, బిహార్‌ తదితర రాష్ర్టాలకు చెందినవారని తెలిపారు. ఒడిసాకు చెందిన వారిని గంజాం జిల్లాలో దింపే విధంగా బస్సులు పంపామన్నారు. మిగిలినవారిని ఆది, సోమవారాల్లో రైళ్లలో పంపించనున్నట్లు చెప్పారు. రోజూ ఐదు నుంచి పది రైళ్లు వెళ్లేలా ప్రణాళికలు రూపొందించినట్లు కృష్ణబాబు తెలిపారు. అంతరాష్ట్ర చెక్‌పోస్టుల వద్ద 500 నుంచి 2000 మందికి పునరావాసం ఉండేలా పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశామని వెల్లడించారు.

Updated Date - 2020-05-18T10:11:44+05:30 IST