Share News

Hyderabad Metro news: 200లోపు ఖర్చుతో.. ఎట్నుంచైనా ఎయిర్‌పోర్టుకు!

ABN , Publish Date - Apr 29 , 2024 | 05:09 AM

గ్రేటన్‌ హైదరాబాద్‌లోని ఇన్నర్‌ రింగ్‌రోడ్‌లో.. ఎక్కడి నుంచైనా రూ.200లోపు ఖర్చుతో మెట్రోలో శంషాబాద్‌కు వెళ్లేలా హెచ్‌ఎంఆర్‌ఎల్‌ అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.

Hyderabad Metro news: 200లోపు ఖర్చుతో..  ఎట్నుంచైనా ఎయిర్‌పోర్టుకు!

మెట్రో రైలులో సాఫీగా ప్రయాణం మొదటి దశ కారిడార్లతో అనుసంధానంగా నాగోల్‌-శంషాబాద్‌ లైన్‌

8 మియాపూర్‌, రాయదుర్గం, జేబీఎస్‌..

3 కారిడార్ల ద్వారా విమానాశ్రయానికి

హైదరాబాద్‌ సిటీ, ఏప్రిల్‌ 28 (ఆంధ్రజ్యోతి): గ్రేటన్‌ హైదరాబాద్‌లోని ఇన్నర్‌ రింగ్‌రోడ్‌లో.. ఎక్కడి నుంచైనా రూ.200లోపు ఖర్చుతో మెట్రోలో శంషాబాద్‌కు వెళ్లేలా హెచ్‌ఎంఆర్‌ఎల్‌ అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. నాగోల్‌ నుంచి ఎల్‌బీనగర్‌, చాం ద్రాయణగుట్ట మీదుగా శంషాబాద్‌ విమానాశ్రయానికి వెళ్లేలా 29 కి.మీ. మేర నిర్మించనున్న మెట్రోలైన్‌ను.. ఇప్పటికే అందుబాటులో ఉన్న మొదటి మూడు దశల కారిడార్లు- మియాపూర్‌-ఎల్‌బీనగర్‌, రాయదుర్గం-నాగోల్‌, జేబీఎ్‌స-ఎంజీబీఎ్‌స(ఓల్డ్‌సిటీ పనులు జరుగుతున్నాయి)తో అనుసంధానం చేయాలని నిర్ణయించారు. దీనివల్ల.. ప్రయాణికులు మొదటి దశలోని ఏ మెట్రో స్టేషన్‌లో రైలెక్కినా.. ఎయిర్‌పోర్టుకు చేరుకోవచ్చు. అందుకు అనుగుణంగా అధికారులు రెండో దశలోని మెట్రో రూట్‌మ్యా్‌పను ఖరారు చేశారు.


భవిష్యత్‌ అవసరాలకు అనుగుణంగా..

ఎయిర్‌పోర్టు మెట్రో లైన్‌లో భాగంగా ఇతర స్టేషన్లను కూడా భవిష్యత్‌ అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దుతున్నారు. ఈ క్రమంలో చాంద్రాయణగుట్ట స్టేషన్‌ ప్రాధాన్యతను సంతరించుకోనుంది. ఈ స్టేషన్‌లో కాన్‌కోర్స్‌ లెవల్స్‌లో ప్లాట్‌ఫారాలను అభివృద్ధి చేయాలని అధికారులు నిర్ణయించారు. ఇప్పటికే అందుబాటులో ఉన్న మూడు కారిడార్లు ఇన్నర్‌ రింగ్‌రోడ్డు లోపలే ఉండడంతో.. ఏ ప్రాంతం నుంచైనా నేరుగా ఎయిర్‌పోర్టుకు ప్రయాణించే సదుపాయాన్ని కల్పించడం సులభతరమవుతోందని అధికారులు చెబుతున్నారు. ఒక్క హైదరాబాద్‌, జీహెచ్‌ఎంసీ పరిధిలోని ప్రయాణికులే కాకుండా.. ఇతర జిల్లాల నుంచి వచ్చే వారికీ ఎయిర్‌పోర్టు ప్రయాణం సమయం, ఖర్చును ఆదా చేస్తుందని వివరిస్తున్నారు. ఉదాహరణకు విజయవాడ, నల్లగొండ వంటి ప్రాంతాల నుంచి వచ్చేవారు ఎల్‌బీనగర్‌లో ఎయిర్‌పోర్టు మెట్రో ఎక్కొచ్చు. కరీంనగర్‌, నిజామాబాద్‌, మెదక్‌ వైపు నుంచి వచ్చేవారు నేరుగా జేబీఎస్‌ మెట్రో ద్వారా సేవలు పొందొచ్చు. కాగా.. ఎయిర్‌పోర్టు మెట్రో టికెట్‌ ప్రయాణ దూరాన్ని బట్టి గరిష్ఠంగా రూ.200గా ఉంటుందని అధికారులు తెలిపారు.


ప్రభుత్వంపైనా భారం తక్కువే!

నిజానికి గత బీఆర్‌ఎస్‌ సర్కారు కూడా రాయదుర్గం నుంచి ఎయిర్‌పోర్టుకు 31 కి.మీ. మేర మెట్రోరైల్‌ పనులను ప్రతిపాదించింది. అయితే.. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆ రూట్‌ను రద్దు చేసింది. సీఎం రేవంత్‌రెడ్డి స్వయంగా అధికారులతో ఈ అంశంపై సమీక్ష నిర్వహించారు. ఐటీ కారిడార్‌లో మెట్రో కోసం భూసేకరణకు భారం తడిసి మోపెడవుతుందని సీఎం భావించారు. అందుకే.. నాగోల్‌-చాంద్రాయణగుట్ట-ఎయిర్‌పోర్టు మార్గాన్ని ఎంచుకున్నారు. పైగా.. రాయదుర్గం నుంచి ఎయిర్‌పోర్టు మార్గం వల్ల కేవలం ఐటీ కారిడార్‌ పరిసరాల్లోని ప్రయాణికులకే ఉపయుక్తంగా ఉంటుందనే అభిప్రాయాలున్నాయి. నిజానికి ఈ ప్రాంతాల వారు ఎక్కువగా సొంత వాహనాల్లోనే ఔటర్‌ మీదుగా ఎయిర్‌పోర్టుకు వెళ్తుంటారు. దాంతో మెట్రోకు పెద్దగా ఆదరణ ఉండకపోవచ్చని రేవంత్‌ సర్కారు భావించినట్లు తెలుస్తోంది. నాగోల్‌-ఎయిర్‌పోర్టు కారిడార్‌తో అన్ని ప్రాంతాల వారికీ మెట్రోసేవలు అందుబాటులో ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఓల్డ్‌సిటీ వంటి ప్రాంతాల నుంచి కూడా నిత్యం విదేశాలకు వెళ్తుంటారని, అలాంటి వారికి కొత్త కారిడార్‌ ఉపయుక్తంగా ఉంటుందని వివరిస్తున్నారు.


ఇదీ.. అధికారుల ప్రణాళిక..!

రెండో దశలో మొత్తం ఆరు కారిడార్లలో 70 కి.మీ. మేర మెట్రోలైన్‌ పనులను ప్రతిపాదించారు. ఇందు లో మొదటి దశలో పూర్తయిన జేబీఎ్‌స-ఎంజీబీఎస్‌ లైన్‌కు మిగిలిన పని(ఫలక్‌నుమా వరకు 5.5కి.మీ)ని పూర్తి చేస్తారు. అంతేకాకుండా.. ఫలక్‌నుమా నుంచి చాంద్రాయణగుట్ట జంక్షన్‌ వరకు(1.5 కి.మీ) పనులను రెండో దశలో కొత్తగా చేర్చారు. ఈ లైన్‌ పూర్తయితే..ప్రయాణికులు జేబీఎ్‌స-చాంద్రాయణగుట్ట కారిడార్‌లో ఏ స్టేషన్‌లో మెట్రో ఎక్కినా.. ఎయిర్‌పోర్టుకు చేరుకోవచ్చు. ఇందుకోసం చాంద్రాయణగుట్ట స్టేషన్‌ను అమీర్‌పేట్‌ ఇంటర్‌చేంజ్‌(రెడ్‌లైన్‌) మాదిరిగా తీర్చిదిద్దనున్నారు. అదేవిధంగా.. రాయదుర్గం-నాగోల్‌ కారిడార్‌ ప్రయాణికులు కూడా.. నాగోల్‌-ఎయిర్‌పోర్ట్‌ కొత్త కారిడార్‌ మీదుగా విమానాశ్రయానికి చేరుకునే వీలుంటుంది.

Updated Date - Apr 29 , 2024 | 10:37 AM