Share News

క్వార్టర్స్‌లో భారత మహిళలు

ABN , Publish Date - Apr 29 , 2024 | 05:43 AM

యువ షట్లర్లతో కూడిన భారత మహిళల జట్టు ఉబెర్‌ కప్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో క్వార్టర్‌ఫైనల్‌ బెర్త్‌ ఖాయం చేసుకుంది. ఆదివారం సింగపూర్‌తో జరిగిన పోరులో మన అమ్మాయిలు 4-1తో విజయం సాధించారు..

క్వార్టర్స్‌లో భారత మహిళలు

ఉబెర్‌ కప్‌ బ్యాడ్మింటన్‌

చెంగ్డూ (చైనా) : యువ షట్లర్లతో కూడిన భారత మహిళల జట్టు ఉబెర్‌ కప్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో క్వార్టర్‌ఫైనల్‌ బెర్త్‌ ఖాయం చేసుకుంది. ఆదివారం సింగపూర్‌తో జరిగిన పోరులో మన అమ్మాయిలు 4-1తో విజయం సాధించారు. ఆసియా చాంపియన్‌ అయిన భారత్‌..తొలి పోరులో 4-1తో కెనడాను చిత్తు చేసిన విషయం విదితమే. సింగపూర్‌తో మొదటి సింగిల్స్‌లో అష్మితా చలిహా ఓడినా..దానిని నుంచి కోలుకున్న భారత్‌ అద్భుత ప్రదర్శన చేసింది. ఇక.. గ్రూప్‌ ‘ఎ’లో చైనా 3-0తో కెనడాపై నెగ్గిన నేపథ్యంలో..భారత్‌తోపాటు ఆతిథ్య మహిళల జట్టుకూడా రౌండ్‌-8కు క్వాలిఫై అయింది. రెండు వరుస విజయాలతో ప్రస్తుతం చైనా తర్వాత భారత్‌ రెండో స్థానంలో నిలిచింది. సింగపూర్‌తో.. మొదటి సింగిల్స్‌ మ్యాచ్‌లో 53వ ర్యాంకర్‌ చలిహా 15-21, 18-21తో వరల్డ్‌ నెం. 18 యో జియా మిన్‌ చేతిలో ఓడింది. అయితే డబుల్స్‌లో..జాతీయ చాంపియన్లు ప్రియ/శ్రుతి 21-15, 21-16తో హెంగ్‌/జిన్‌పై గెలవడంతో స్కోరు 1-1తో సమమైంది. అనంతరం రెండో సింగిల్స్‌లో ఇషా రాణి 21-13, 21-16తో ఇన్సిరా ఖాన్‌పై నెగ్గి భారత్‌ ఆధిక్యాన్ని 2-1కి పెంచింది. ఆపై సిమ్రన్‌/రితిక 21-8, 21-11తో టింగ్‌/జాన్‌ని చిత్తు చేయడంతో మనోళ్లు 3-1తో తిరుగులేని స్థితిలో నిలిచారు. మూడో సింగిల్స్‌లో అన్మోల్‌ 21-15, 21-13తో లీని ఓడించడంతో భారత్‌ ఆధిక్యం మరింత పెరిగింది. ఇక థామస్‌ కప్‌లో..డిఫెండింగ్‌ చాంపియన్‌ భారత పురుషుల జట్టు సోమవారం ఇంగ్లండ్‌ను ఢీకొంటుంది.

Updated Date - Apr 29 , 2024 | 05:43 AM