Share News

ఓటుకు రైట్‌రైట్‌

ABN , Publish Date - May 06 , 2024 | 03:54 PM

ఎన్నికల నేపథ్యంలో నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు వేసవి టూర్‌ గేర్లను మార్చుతున్నారు.

ఓటుకు రైట్‌రైట్‌

  • నగరవాసులకు సొంతూళ్ల నుంచి పిలుపు

  • రవాణా, ఇతర ఖర్చులు ఇస్తామని హామీ

  • సర్పంచ్‌లు, ఎంపీటీసీలకు గ్రామాల బాధ్యతలు

  • నాలుగైదు రోజులుగా నేతల నుంచి ఫోన్లు

  • వరుస సెలవులతో సొంతూరుకు వెళ్లే ప్లాన్‌

  • ఇప్పటికే దూర ప్రాంతాల బస్సుల్లో సీట్లన్నీ బుకింగ్‌

  • సొంత వాహనాల్లో వెళ్లేందుకూ ఏర్పాట్లు

  • ఈనెల 11 నుంచి ఏపీ రైళ్లన్నీ కిటకిట

హైదరాబాద్‌ సిటీ, మే 6 (ఆంధ్రజ్యోతి): ఎన్నికల నేపథ్యంలో నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు వేసవి టూర్‌ గేర్లను మార్చుతున్నారు. స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ఇచ్చిన తరుణంలో పిల్లలతో కలిసి వారికి నచ్చిన ప్రదేశాలకు తీసుకెళ్లేందుకు ఇప్పటివరకు సిద్ధమైన తల్లిదండ్రులు ఒక్కసారిగా ప్లాన్‌ చేంజ్‌ చేస్తున్నారు. ఓటు వేసేందుకు తప్పకుండా రావాలని సొంతూర్ల నుంచి ‘మనవాళ్లు ఫోన్లు చేస్తున్నారని.. అక్కడికి వెళ్లకుంటే బాగుండదని, పోలింగ్‌ జరిగిన తర్వాత మీరు అడిగిన చోటకు వెళ్దామని’ పిల్లలను బుజ్జగిస్తున్నారు. ఏపీ, తెలంగాణలో సార్వత్రిక ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఎమ్మెల్యే, ఎంపీ స్థానాలకు పోటీచేస్తున్న అభ్యర్థులు గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. పోలింగ్‌కు కేవలం వారం రోజులు మాత్రమే సమయం ఉండడంతో స్థానిక నాయకులు, కార్యకర్తలతో ముమ్మరంగా ప్రచారం చేయిస్తున్నారు. అలాగే హైదరాబాద్‌ నగరంలో ఉండే వలస ఓటర్లకు వారితో తరచూ ఫోన్లు చేయిస్తున్నారు. ఊరికి వచ్చి ఓటేయాలని, రానుపోనూ రవాణా ఖర్చులతోపాటు ఓటుకు కొంత ఇస్తామని వారితో హామీ ఇప్పిస్తున్నారు. దీంతో నగరంలో ఉండే దినసరి కూలీలు, ప్రైవేట్‌ ఉద్యోగులు ఓటింగ్‌ రోజున సొంతూర్లకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.

ఏపీకి ఎక్కువ మంది

ఏపీలో జరుగుతున్న అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల నేపథ్యంలో నగరంలో ఉండే ఆయా ప్రాంతాలకు చెందిన ఓటర్లకు 20 రోజుల నుంచే స్థానిక నాయకులు ఫోన్లు చేస్తున్నారు. ఈసారి ఎన్నికలు కీలకంగా ఉన్నాయని, ఓటు వేసేందుకు తప్పకుండా రావాలని విజ్ఞప్తి చేస్తున్నారు. దీంతో నగరంలోని ఏపీకి చెందిన ఓటర్లు ఈనెల 13న జరిగే పోలింగ్‌కు రెండు, మూడు రోజుల ముందే సొంతూర్లకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. రైళ్లు, బస్సుల్లో టికెట్‌ రిజర్వేషన్లు అందుబాటులో లేకపోవడంతో సొంత వాహనాల్లో బయలుదేరేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇదిలా ఉండగా, ఏపీతోపాటు తెలంగాణలోని వివిధ జిల్లాలకు చెందిన ప్రజలు సైతం ఓటింగ్‌కు సొంతూళ్లకు వెళ్లేందుకు రెడీ అవుతున్నారు. ఓటు వేయడంతోపాటు వేసవి సెలవులను గడిపేందుకు ప్లాన్‌ చేసుకుంటున్నారు. మొత్తంగా ఓట్ల పండుగ.. కొంతమంది సమ్మర్‌ టూర్‌ ప్లాన్‌ను మార్చడం ఆసక్తికరంగా మారింది.

  • గచ్చిబౌలిలో కిరాణం షాపు నడుపుకునే వెంకటేశ్వర్‌రావుకు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. నిత్యం దుకాణంలో బిజీబిజీగా ఉండే ఆయన ఈ వేసవి సెలవుల్లో కుటుంబ సభ్యులతో కలిసి కులుమనాలీకి వెళ్లాలని భావించాడు. ఈ మేరకు టూర్‌ ప్యాకేజీకి సంబంధించిన వివరాలను పదిరోజుల క్రితం తెలుసుకున్నాడు. ఈనెల 15 నుంచి 22 వరకు యాత్రకు ప్లాన్‌ చేసుకున్నాడు. అయితే రెండు రోజుల క్రితం ఆయన సొంతూరు ఏపీలోని నెల్లూరు నుంచి కుటుంబ సభ్యులు, స్నేహితులు ఫోన్‌ చేశారు. 13న జరిగే ఓట్ల పండుగకు తప్పకుండా రావాలని కోరారు. దీంతో ఆయన కులుమనాలీ యాత్రను పక్కనపెట్టి స్వగ్రామానికి వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాడు.

  • కర్నూల్‌లోని డోన్‌కు చెందిన శ్రీనివా్‌సరెడ్డి గ్రేటర్‌ పరిధిలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తుంటాడు. సొంతూరులో ఆయనతోపాటు భార్య, తల్లిదండ్రులకు కలిపి నాలుగు ఓట్లు ఉన్నాయి. అయితే హైదరాబాద్‌లో మండుతున్న ఎండల నుంచి కాస్తా ఉపశమనం పొందేందుకు సిమ్లాకు వెళ్దామని పిల్లలు పట్టుబట్టడంతో ఆయన సరేనని ఒప్పుకున్నాడు. ఈ మేరకు రైలు రిజర్వేషన్‌ కోసం ఆన్‌లైన్‌లో వెతికితే జూన్‌ 2 వరకు వెయిటింగ్‌ లిస్టు చూపించింది. దీంతో ఆయన ఒక్కసారిగా టూర్‌ ప్లాన్‌ను మార్చాడు. ఏపీలో ఎన్నికలు జరుగుతున్నందున పదిరోజుల పాటు తన స్వగ్రామంతోపాటు కర్నూలులోని అత్తగారింటికి వెళ్తే పిల్లలకు రిలీఫ్‌ ఉంటుందని భావిస్తున్నాడు. ఇలా వెళ్లడం ద్వారా సొంతూరిలో ఓటు వేయడంతోపాటు కుటుంబసభ్యులను కలిసే అవకాశం ఉంటుందని చెబుతున్నాడు. ఈనెల 10న తన సొంత వాహనంలో డోన్‌కు బయలుదేరేందుకు సిద్ధమయ్యాడు.

Updated Date - May 06 , 2024 | 03:54 PM