Share News

మనోడే మరువొద్దు

ABN , Publish Date - May 04 , 2024 | 03:41 PM

హైదరాబాద్‌ మహా నగరంలో అత్యంత కీలకంగా ఉన్న సికింద్రాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గంలో కుల సమీకరణలు మొదలయ్యాయి.

మనోడే మరువొద్దు

  • సికింద్రాబాద్‌లో జోరుగా కుల సమీకరణలు

  • సామాజిక వర్గం ఓట్లు పడేలా ఏర్పాట్లు

  • ఇప్పటికే ఆయా కుల పెద్దలతో మంతనాలు

  • తమవాడినే గెలిపించాలని తీర్మానాలు

  • పార్టీలతో సంబంధం లేకుండా మద్దతు

  • మున్నూరుకాపు, గౌడ, యాదవ, ముదిరాజ్‌ల ఓట్లు కీలకం

  • ప్రభావితం చేయనున్న క్రిస్టియన్‌ ఓట్లు

  • లష్కర్‌ బరిలో ఇద్దరు బీసీ, మరొకరు రెడ్డి

హైదరాబాద్‌ సిటీ, మే 4 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌ మహా నగరంలో అత్యంత కీలకంగా ఉన్న సికింద్రాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గంలో కుల సమీకరణలు మొదలయ్యాయి. సాధారణంగా కార్పొరేటర్‌, ఎమ్మెల్యే ఎన్నికల్లో బాహాటంగా జరిగే కుల రాజకీయాలు ఈ ఎన్నికల్లోనూ జోరు అందుకున్నాయి. అభ్యర్థుల సామాజిక వర్గాన్ని ఆధారంగా చేసుకొని ఆయా కుల పెద్దలను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు అభ్యర్థులు. బీఆర్‌ఎస్‌ నుంచి బరిలో దిగిన పద్మారావుకు గౌడ సామాజిక వర్గం, కాంగ్రెస్‌ నుంచి బరిలో దిగిన దానం నాగేందర్‌కు మున్నురుకాపు సామాజిక వర్గాల ఓట్లను గంపగుత్తగా రాబట్టుకునేందుకు తెరవెనుక ప్రయత్నాలు ప్రారంభించారు. ఆయా సామాజిక వర్గాల ప్రధాన కార్యాలయాలన్ని సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గాల పరిధిలోనే ఉండడంతో పెద్దలంతా పార్టీలతో సంబంధం లేకుండా తమ సామాజిక వర్గ అభ్యర్థిని గెలిపించుకోవాలంటూ ఓ నిర్ణయానికి వచ్చిన్నట్లు తెలుస్తోంది.

ప్రభావితం చేయనున్న పలు వర్గాలు

ఈ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో ముషీరాబాద్‌, నాంపల్లి, సికింద్రాబాద్‌, సనత్‌నగర్‌, ఖైరతాబాద్‌, జూబ్లీహిల్స్‌, అంబర్‌పేట అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఈ నియోజకవర్గాల్లో ఇతర రాష్ట్రాలకు చెందినవారు కూడా పెద్ద సంఖ్యలో నివాసముంటున్నారు. దాంతో పాటు వివిధ సామాజిక వర్గాలకు బలమైన ప్రాంతాలున్నాయి. ప్రధానంగా యాదవ, ముదిరాజ్‌, మున్నురుకాపు, గంగాపుత్ర, గౌడ్‌, ఎస్సీ, ఎస్టీ ఇలా పలు సామాజిక వర్గాలకు చెందినవారు ఆయా అసెంబ్లీ నియోజకవర్గాలను ప్రభావితం చేసేవిధంగా ఉన్నారు. ఆయా సామాజిక వర్గాల ఓట్లను గంపగుత్తగా రాబట్టుకునేందుకు అభ్యర్థులు ఏ అంశాన్నీ వదలడం లేదు. ఇప్పటికే పలువురు కులపెద్దలతో సంప్రదింపులు జరిపిన్నట్లు తెలుస్తోంది.

పార్టీలతో సంబంధం లేకుండానే..

కాంగ్రెస్‌ అభ్యర్థి దానం నాగేందర్‌ సామాజికవర్గం మున్నురుకాపు కావడంతో ఇప్పటికే ఆయా కులపెద్దలంతా ఓ నిర్ణయానికి వచ్చిన్నట్లు తెలిసింది. మున్నురుకాపులు ఎవరూ ఏ పార్టీలో ఉన్నా.. తమ సామాజికవర్గానికి చెందిన అభ్యర్థికి మాత్రమే ఓటేయ్యాలని సూచనలు కూడా చేసిన్నట్లు తెలిసింది. ఈ సామాజికవర్గం అంబర్‌పేట, సనత్‌నగర్‌, జూబ్లీహిల్స్‌, ఖైరతాబాద్‌ నియోజకవర్గాల్లో బలంగా ఉండడంతో ఆ ఓట్లను గంపగుత్తగా రాబట్టుకునేందుకు ప్రయత్నం చేస్తున్నట్లుగా తెలిసింది. అదేవిధంగా బీఆర్‌ఎస్‌ అభ్యర్థి పద్మారావు గౌడ్‌కు ఇప్పటికే గౌడ సామాజికవర్గం నుంచి కులపెద్దలంతా మద్దతు ప్రకటించడంతో పాటు ఆయనకే ఓటేయ్యాలంటూ ప్రచారం మొదలుపెట్టారు. పార్టీలతో సంబంధం లేకుండా ఓటేయ్యాలంటూ సామాజిక వర్గం పెద్దలు నిర్ణయించి వాట్సాప్‌ గ్రూప్‌లలో సమాచారాన్ని చెరవేస్తున్నట్లు సమాచారం.

భారీగా డిమాండ్లు

ఆయా సామాజిక వర్గాల పెద్దలతో చర్చించే క్రమంలో భారీగా డిమాండ్లు కూడా వస్తున్నట్లు తెలుస్తోంది. పలువురు తగిన మొత్తంలో ఫండ్‌ అడుగుతుండడంతో పాటు వివిధ రకాల పనులు చేయాలని కోరుతున్నట్లు సమాచారం. అవసరమైతే తమ సామాజిక వర్గాలతో భారీ సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని, సమావేశానికి హాజరై తమ డిమాండ్ల పరిష్కారానికి అందరి సమక్షంలో హామీ ఇవ్వాలని పలువురు కోరుతున్నట్లు తెలిసింది. అలాగే రెండోసారి ఎలాగైనా గెలిచి పట్టు నిలుపుకోవాలని రెడ్డి సామాజిక వర్గానికి చెందిన కిషన్‌రెడ్డి కూడా ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. వారి సామాజిక వర్గానికి సంబంధించి కూడా ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేస్తూ హామీలు ఇస్తూ తమ వైపునకు తిప్పుకుంటున్నారు.

Updated Date - May 04 , 2024 | 03:41 PM