ప్రజ్వల్పై ఫిర్యాదు చేసిన బాధితురాలి కిడ్నాప్!
ABN , Publish Date - May 04 , 2024 | 02:43 AM
జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ రాసలీలల వివాదంలో కీలకమైన పనిమనిషి, పోలీసులకు ఫిర్యాదు చేసిన మహిళ కిడ్నాప్ కు గురయ్యారు.
బెంగళూరు, మే 3(ఆంధ్రజ్యోతి): జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ రాసలీలల వివాదంలో కీలకమైన పనిమనిషి, పోలీసులకు ఫిర్యాదు చేసిన మహిళ కిడ్నాప్ కు గురయ్యారు. ఆమె కుమారుడు మైసూరు జిల్లా కేఆర్ నగర పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ప్రజ్వల్తోపాటు ఆయన తండ్రి, ఎమ్మెల్యే హెచ్డీ రేవణ్ణపై గురువారం రాత్రి కిడ్నాప్ కేసు నమోదు చేశారు. తన తల్లి ఏప్రిల్ 29వ తేదీ రాత్రి నుంచి కనిపించడం లేదని బాధితురాలి కుమారుడు(20) పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. 2015 నుంచి ఆరేళ్లపాటు హొళెనరసీపురలోని రేవణ్ణ ఇంట్లో తన తల్లి పనిచేశారని, మూడేళ్ల కిందట పని మానేసి వచ్చారని, ఇక్కడే కూలి పనులు చేసుకుంటున్నారని వివరించారు. ఏప్రిల్ 29వ తేదీ రాత్రి 9 గంటలకు రేవణ్ణ అనుచరుడు సతీశ్బాబణ్ణ తమ ఇంటికి వచ్చి ‘మీ తల్లిపై కేసు నమోదైంది. రేవణ్ణ పిలుస్తున్నారు’ అని చెప్పి ఆమెను తీసుకెళ్లారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అప్పటి నుంచి తన తల్లి కనిపించడం లేదని వాపోయారు. మరోవైపు, ప్రజ్వల్ తల్లి భవాని రేవణ్ణకు సిట్ నోటీసులిచ్చింది. ఈ కేసులో రేవణ్ణ బెయిల్ పిటిషన్పై విచారణ శనివారానికి వాయిదా పడింది. కాగా, తాజాగా నమోదు చేసిన కిడ్నాప్ కేసు ఇంకా సిట్ దాకా చేరలేదు. ప్రజ్వల్పై శుక్రవారం మరో కేసు నమోదైంది. తనను గన్తో బెదిరించి, పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడని 44 ఏళ్ల మహిళ సీఐడీ సైబర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో ప్రజ్వల్పై మరో కేసు నమోదు చేశారు.