ఎస్బీఐ లాభం రూ.21,384 కోట్లు
ABN , Publish Date - May 10 , 2024 | 02:22 AM
ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) కన్సాలిడేటెడ్ లాభం ఈ ఏడాది మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికంలో 18 శాతం పెరిగి రూ.21,384.15 కోట్లుగా...
త్రైమాసిక, వార్షిక లాభాలు రెండూ చారిత్రక గరిష్ఠమే
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) కన్సాలిడేటెడ్ లాభం ఈ ఏడాది మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికంలో 18 శాతం పెరిగి రూ.21,384.15 కోట్లుగా నమోదైంది. వడ్డీయేతర ఆదాయం ఇందుకు దోహదపడింది. ఏడాది క్రితం ఇదే కాలంతో పోల్చితే స్టాండ్ఎలోన్ ప్రాతిపదికన త్రైమాసిక లాభం రూ.16,694.51 కోట్ల నుంచి రూ.20,698.35 కోట్లకు పెరిగింది. ఇదిలా ఉండగా 2023-24 ఆర్థిక సంవత్సరం మొత్తం మీద కన్సాలిడేటెడ్ లాభం 20.55 శాతం పెరిగి రూ.67,084.67 కోట్లకు చేరినట్టు బ్యాంక్ చైర్మన్ దినేశ్ కుమార్ ఖారా చెప్పారు. 2022-23లో ఇది రూ.55,648.17 కోట్లుంది. త్రైమాసికంగాను, వార్షికంగాను కూడా బ్యాంక్ లాభం చారిత్రక గరిష్ఠ స్థాయి అని ఆయన చెప్పారు. వడ్డీయేతర ఆదాయం 24.41 శాతం పెరిగి రూ.17,369 కోట్లకు చేరడం ద్వారా బ్యాంకు లాభాల్లో వృద్ధికి గట్టి మద్దతు ఇచ్చిందన్నారు. ముఖ్యాంశాలు...
రుణాల్లో 15 శాతం వృద్ధి ఏర్పడడంతో నికర వడ్డీ ఆదాయం 3.13ు పెరిగి రూ.41,655 కోట్లకు చేరింది. అయితే నికర వడ్డీ మార్జిన్ మాత్రం 0.08ు తగ్గింది.
రుణ వృద్ధి కార్పొరేట్, వ్యవసాయం, రిటైల్, చిన్న వ్యాపారాలు సహా అన్ని రంగాలకు విస్తరించింది. కార్పొరేట్ రుణాల్లో 16 శాతం వృద్ధి నమోదైంది. కార్పొరేట్ రుణాల పరిమాణం రూ.4 లక్షల కోట్లుంది. ఇందులో ప్రైవేట్ కార్పొరేట్ల వాటా నాలుగింట మూడు వంతులు కాగా మిగతాది ప్రభుత్వ కార్పొరేట్లది.
2025 ఆర్థిక సంవత్సరంలో రుణ వృద్ధి 15 నుంచి 16ు ఉంటుందని అంచనా. నికర వడ్డీ ఆదాయం కూడా ఇదే స్థాయిలో కొనసాగించాలని భావిస్తోంది.
డిపాజిట్లలో వృద్ధి 11.13 శాతం ఉంది. ఈ ఏడాది 13 శాతం వృద్ధి సాధించాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది.
స్థూల మొండి బకాయిలు (ఎన్పీఏ) 2.78 శాతం నుంచి 2.24 శాతానికి తగ్గాయి. డిసెంబరు త్రైమాసికం చివరి నాటికి ఇవి 2.42 శాతం ఉన్నాయి.
బ్యాంక్ మూలధన నిధుల నిష్పత్తి (సీఏఆర్) 14.28 శాతం ఉంది. 20 శాతం రుణ వృద్ధిని ఇది తట్టుకోగలుగుతుంది.
బంగారు రుణాల పరిమాణం రూ.1.38 లక్షల కోట్లుంది. సమీప భవిష్యత్తులో ఎలాంటి సవాళ్లు కనిపించడంలేదు.