ఎలాన్ మస్క్ ఆకస్మిక చైనా పర్యటన
ABN , Publish Date - Apr 29 , 2024 | 06:32 AM
అమెరికన్ కుబేరుడు, టెస్లా కంపెనీ సీఈఓ ఎలాన్ మస్క్ ఆదివారం ఆకస్మికంగా చైనా సందర్శించారు. ఆయన చైనా ప్రధాని లీ కియాంగ్తో సమావేశమయ్యారు...
ప్రధాని లీ కియాంగ్తో భేటీ
బీజింగ్: అమెరికన్ కుబేరుడు, టెస్లా కంపెనీ సీఈఓ ఎలాన్ మస్క్ ఆదివారం ఆకస్మికంగా చైనా సందర్శించారు. ఆయన చైనా ప్రధాని లీ కియాంగ్తో సమావేశమయ్యారు. ఈ సమావేశం వివరాలు వెల్లడి కాలేదు. అయితే చైనా ప్రభుత్వానికి చెందిన భవనాలు, ఎగ్జిబిషన్ కేంద్రాల వద్ద టెస్లా కార్ల పార్కింగ్ను నిషేధిస్తూ విధించిన ఆంక్షలను తొలగించమని ఆయన చైనా ప్రధానిని కోరినట్టు సమాచారం. దీనికి తోడు స్వయం నియంత్రిత (అటానమస్) విద్యుత్ కార్లను చైనా మార్కెట్లో ప్రవేశపెట్టే విషయం, చైనాలో టెస్లా వ్యా పార విస్తరణ గురించి చర్చించినట్టు సిన్హువా వార్తా సంస్థ తెలిపింది. బిజీ షెడ్యూల్ పేరుతో గత ఆదివారం భారత పర్యటన రద్దు చేసుకున్న మస్క్ వారం తిరక్కుండానే ప్రైవేట్ విమానంలో చైనా పర్యటనకు వెళ్లడం విశేషం. 2020లో 700 కోట్ల డాలర్ల పెట్టుబడితో చైనాలోని షాంఘైలో టెస్లా ఉత్పత్తి యూనిట్ ఏర్పాటు చేసింది. చైనా ప్రీమియం ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్లో టెస్లాది అగ్రస్థానం. అయితే ఇటీవల స్థానిక కంపెనీల నుంచి తీవ్ర పోటీ ఎదురవుతోంది. షాంఘైలో త యారయ్యే టెస్లా ప్రీమియం ఎలక్ట్రిక్ కార్ల ధరలు ఆరు శాతం తగ్గించినా, చైనా ఈవీ కంపెనీలతో పోటీపడలేకపోతోంది. దీంతో డ్రైవర్లేకుండా రోబోలు నడిపే మరింత అధునాతనమైన ఈవీలను టెస్లా చైనామార్కెట్లో ప్రవేశపెట్టి తన మార్కెట్ను కాపాడుకోవాలని భావిస్తున్నట్టు సమాచారం.