మూడేళ్లలో రూ.3,000 కోట్ల పెట్టుబడి
ABN , Publish Date - Apr 29 , 2024 | 06:20 AM
అపోలో హాస్పిటల్స్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ (ఏహెచ్ఈఎల్) వ్యాపార విస్తరణకు సిద్ధమవుతోంది. ఇందు కోసం వచ్చే మూడేళ్లలో రూ.3,000 కోట్లు ఖర్చు చేస్తామని కంపెనీ చీఫ్ ఫైనాన్సియల్...
న్యూఢిల్లీ: అపోలో హాస్పిటల్స్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ (ఏహెచ్ఈఎల్) వ్యాపార విస్తరణకు సిద్ధమవుతోంది. ఇందు కోసం వచ్చే మూడేళ్లలో రూ.3,000 కోట్లు ఖర్చు చేస్తామని కంపెనీ చీఫ్ ఫైనాన్సియల్ ఆఫీసర్ (సీఎఫ్ఓ) కృష్ణన్ అఖిలేశ్వరన్ చెప్పారు. ఏహెచ్ఈఎల్ అనుబంధ సంస్థ అపోలో హెల్త్కం ఈక్విటీలో 12.1 శాతం వాటా కోసం రూ.2,475 కోట్లు చెల్లించేందుకు అంతర్జాతీయ పీఈ సంస్థ అడ్వంట్ ఇంటర్నేషనల్ ఇటీవల ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో రూ.890 కోట్లను ఏహెచ్ఈఎల్ వ్యాపార విస్తరణ కోసం, మరో రూ.860 కోట్లను అపోలో హెల్త్ అనుబంధ సంస్థ అపోలో 24/7 విస్తరణ కోసం వినియోగిస్తామని అఖిలేశ్వరన్ తెలిపారు. ఏహెచ్ఈఎల్కు అందే రూ.890 కోట్లను ఇతర హాస్పిటల్స్ కొనుగోలు లేదా ఏహెచ్ఈఎల్ విస్తరణ కోసం ఖర్చు చేస్తామన్నారు. అపోలో 24/7లో కీమెడ్ విలీనం పెద్ద మైలురాయి అన్నారు. దీంతో అపోలో ఫార్మసీల సంఖ్య 70,000కు పెరుగుతుందన్నారు.