Share News

టీడీపీ మైనారిటీ నేత ఇంటిపై వంశీ అనుచరుల దాడి

ABN , Publish Date - May 04 , 2024 | 05:25 AM

కృష్ణాజిల్లాలో వైసీపీ మూకలు రెచ్చిపోయాయి. టీడీపీ మైనారిటీ నేత ఇంటిపై దాడిచేసి ఆయన కుమారుడు, 16ఏళ్ల మనవరాలిని తీవ్రంగా గాయపరిచారు.

టీడీపీ మైనారిటీ నేత ఇంటిపై వంశీ అనుచరుల దాడి

ఆయన కుమారుడు, మనుమరాలికి తీవ్ర గాయాలు

హనుమాన్‌జంక్షన్‌ రూరల్‌, మే 3: కృష్ణాజిల్లాలో వైసీపీ మూకలు రెచ్చిపోయాయి. టీడీపీ మైనారిటీ నేత ఇంటిపై దాడిచేసి ఆయన కుమారుడు, 16ఏళ్ల మనవరాలిని తీవ్రంగా గాయపరిచారు.

బాపులపాడు మండలం కొత్త మల్లవల్లిలో గురువారం అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. కొత్త మల్లవల్లికి చెందిన షేక్‌జాన్‌ బాషా, ఆయన కుమారుడు మీర్జావలి టీడీపీలో క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. కొత్త మల్లవల్లి చెంతనే ఉన్న మీర్జాపురానికి గురువారం నూజివీడు టీడీపీ అభ్యర్ధి పార్ధసారథి వచ్చారు.

ఆయన్ను కలిసేందుకు మీర్జావలి వెళ్లారు. అక్కడే అలీ అనే వైసీపీ కార్యకర్త ఉండటంతో.. అలీ గన్నవరంలో వైసీపీకి, నూజివీడులో టీడీపీకి పనిచేస్తున్నారని సారథికి మీర్జావలి ఫిర్యాదు చేశారు.

ఇది మనసులో పెట్టుకుని గురువారం రాత్రి కొత్తమల్లవల్లిలో గన్నవరం వైసీపీ అభ్యర్థి వంశీతోపాటు ప్రచారానికి వచ్చిన అలీ, వైసీపీ కార్యకర్తలు మీర్జావలి కుటుంబంతో ఘర్షణకు దిగారు.

మీర్జావలి, ఆయన తండ్రి షేక్‌ జాన్‌ బాషా, ఇతర కుటుంబసభ్యులపై కర్రలతో దాడి చేశారు. మీర్జావలిపై బీరు సీసాతో దాడి చేయగా చేతికి గాయమై నరం కోసుకుపోయింది.

ఈ గొడవను సెల్‌ఫోన్‌లో చిత్రీకరిస్తున్న షేక్‌ జాన్‌ బాషా మనవరాలు నసీమాపైనా కర్రతో దాడి చేయడం తో ఆమె చెయ్యి విరిగింది. పోలీసులు రాకతో అల్లరిమూకలు చెల్లాచెదురయ్యారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

Updated Date - May 04 , 2024 | 05:25 AM