Share News

జగన్‌ మళ్లీ వస్తే.. మన భూములన్నీ దోపిడీ

ABN , Publish Date - May 04 , 2024 | 03:41 AM

జగన్‌ మళ్లీ అధికారంలోకి వస్తే ప్రజల ఆస్తులన్నీ గాల్లోనే ఉంటాయని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ స్పష్టం చేశారు.

జగన్‌ మళ్లీ వస్తే.. మన భూములన్నీ దోపిడీ

ల్యాండ్‌ గ్రాబింగ్‌ యాక్టు అందుకే: పవన్‌

వైసీపీకి ఓటేస్తే కొంప కొల్లేరే !

కూటమికి ఓటేస్తే మీ కోసం రక్తం ధారబోస్తా

కైకలూరు, గిద్దలూరు సభల్లో జనసేనాని ప్రకటన

నెల్లూరులో బాబుతో కలిసి ఉమ్మడి సభ

ఏలూరు/ కైకలూరు/ఒంగోలు, మే 3(ఆంధ్రజ్యోతి): జగన్‌ మళ్లీ అధికారంలోకి వస్తే ప్రజల ఆస్తులన్నీ గాల్లోనే ఉంటాయని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ స్పష్టం చేశారు. ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్టుతో మన భూములు, ఆస్తులను ఈ సీఎం దోచుకుపోతారని హెచ్చరించారు. శుక్రవారం ఆయన ఏలూరు జిల్లా కైకలూరు, ప్రకాశం జిల్లా గిద్దలూరుల్లో జరిగిన వారాహి విజయయాత్ర సభల్లో ప్రసంగించారు. టీడీపీ అధినేత చంద్రబాబుతో కలిసి రాత్రి నెల్లూరులో ఉమ్మడి బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సీఎం అబద్ధాలకోరని.. మద్యనిషేధం అంటూ మద్యం తానే అమ్మాడని ధ్వజ మెత్తారు. వైసీపీ కోటలు బద్దలు కొడతామని పవన్‌ ఆయా సందర్భాల్లో తేల్చిచెప్పారు. అది ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్టు కాదని.. జగన్‌ గ్రాబింగ్‌ యాక్టు అని.. దీనిద్వారా రాష్ట్రంలో సాగులో లేని భూములన్నీ ఆక్రమణలకు గురవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. మన భూముల పట్టాదార్‌ పాసుపుస్తకాలపై జగన్‌ బొమ్మలు ఎలా వేసుకుంటారని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడగానే మెగా డీఎస్సీని ప్రకటిస్తామన్నారు. వెలిగొండ సొరంగాలను ప్రారంభించకుండా మోసం చేసిన జగన్‌కు ప్రకాశం జిల్లా ప్రజలు బుద్ధి చెప్పాలని పిలుపిచ్చారు. నెల్లూరుతో ఉన్న తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. నెల్లూరు తనకు చాలా ఇచ్చిందని అన్నారు. ఇంకా ఏమన్నారంటే..

అసెంబ్లీ ఉన్నదెందుకు?

ఆస్తి పత్రాలుగా జిరాక్స్‌ కాపీలు ఇస్తారా..? మన ఆస్తి పత్రాలు రెవెన్యూ ఆఫీసుల్లో ఉంటాయట! ఆ ఆస్తిని 90 రోజుల్లో మనం నిరూపించుకోలేకపోతే అవి కైకలూరు వైసీపీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు వంటివారు దోచేసుకుంటారు. దీనిపై పోలీసుస్టేషన్‌కు వెళ్లడానికి లేదు. కోర్టులకు వెళ్లడానికి లేదు. రెండెకరాల రైతు హైకోర్టుకు ఎలా వెళ్లగలడు..? ఇదెక్కడి న్యాయం ఇదెక్కడి చట్టం? మన ఆడపిల్లలకు పెళ్లి చేసి అత్తవారింటికి పంపేటప్పుడు ఆస్తి పత్రాలుగా జిరాక్స్‌ కాపీలు ఇస్తామా..? మనకు డబ్బు అవసరమై.. ఫైనాన్షియర్‌ దగ్గరకో, బ్యాంకుకో వెళ్లి ఈ జిరాక్స్‌ కాపీలు చూపిస్తే మనకు అప్పు పుడుతుందా..? ఈ ల్యాండ్‌ గ్రాబింగ్‌ యాక్ట్‌ ద్వారా జగన్‌ మన భూములను దోచుకుపోతాడు. కూటమి రాగానే ఈ యాక్టును రద్దుచేస్తాం. యువత వైసీపీకి ఓటేస్తే భవిష్యత్‌ అంధకారమే. 2019లోనే నేను చెప్పా.. ఎవరూ వినలేదు.. వైసీపీకి ఓటు వేశారు.. ఇప్పుడేమైంది? మన భవిష్యత్‌ కోసం పవన్‌ కల్యాణ్‌ వచ్చాడు. అన్ని పార్టీలను కలిపాడు. తగ్గి మరీ కూటమిని ఏర్పాటు చేశాడు. ఆ భవిష్యత్‌ కోసం జాగ్రత్తగా ఓటెయ్యండి.


ఇదీ బాబు విజన్‌..

చంద్రబాబు విజన్‌-2020 అంటే అదెలా ఉంటుందోనని 2020 సంవత్సరం వరకు ఎదురుచూశాం. ఆ తర్వాత హైదరాబాద్‌లో హైటెక్‌ సిటీ, మాదాపూర్‌ ప్రాంతాలకు వెళ్లిచూస్తే విజన్‌ అంటే ఇలా ఉంటుందని, విజన్‌ కలిగిన నాయకుడుంటే ఇట్లాంటి అద్భుతాలు జరుగుతాయని తెలిసింది. ముఖ్యమంత్రి రెండు చేతులతో నమస్కారం పెట్టి ఓట్లడగాలి. కానీ జగన్‌ మాత్రం వైసీపీ పోస్టర్లలో వేలు చూపిస్తూ బెదిరించి మరీ అడుగుతున్నారు..

గర్జించిన సింహపురి

టీడీపీ, జనసేన అధినేతలు ఉమ్మడిగా తొలిసారి ఎన్నికల ప్రచారానికి నెల్లూరుకు రావడంతో నెల్లూరు నగరం కిక్కిరిసిపోయింది. మూడు కిలోమీటర్ల మేర ఎటు చూసినా జనమే. కేవీఆర్‌ జంక్షన్‌ నుంచి నర్తకీ సెంటర్‌ వరకు రోడ్‌షో జరుగగా.. చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ ప్రజలకు అభివాదం చేస్తూ కదిలారు. ప్రజలు పూలవర్షం కురిపించారు.

ఫ కులం కాని కులం.. మనమంతా కార్మికులం. భవన నిర్మాణ కార్మికుల కోసం ప్రభుత్వం సెస్‌ వసూలు చేసి ఆ నిధి నుంచి రూ.450 కోట్లను జగన్‌ ప్రభుత్వం దోచేసింది. మేం అధికారంలోకి వచ్చాక నిర్మాణ కార్మికుల అండగా సంక్షేమ నిధిని ఏర్పాటు చేస్తాం.

ఫ చంద్రబాబు రాష్ట్రానికి అవసరం. జనసైనికుల పోరాట పటిమ అవసరం. టీడీపీ తాలూ కు నిర్మాణాత్మకత అవసరం. బీజేపీ నాయకుల శక్తి అవసరం.. ఇవన్నీ కలిపి కూటమిగా రాష్ట్ర ప్రజల కోసమే వచ్చాం. జనాన్ని భుజాలమీదకు ఎత్తుకుని ఊరేగించడానికే వచ్చాను. అది జరిగే వరకు విశ్రమించను.

-పవన్‌ కల్యాణ్‌


జగన్‌ ది కడుపా.. కంభం చెరువా?

పేరొందిన కంభం చెరువు కంటే సీఎం జగన్‌ పొట్ట పెద్దది.. ఎంత తిన్నా నిండదు. ప్రతి చేతికీ పని కల్పించడం.. ప్రతిచేనుకూ నీళ్లు ఇవ్వడం ఎన్డీయే లక్ష్యం. గిద్దలూరు నియోజకవర్గంలో జనసేనకు ఒంటరిగా పోటీచేసే సత్తా ఉంది.. అయినా రాష్ట్ర శ్రేయస్సు కోసం టీడీపీ అభ్యర్థిని రంగంలోకి దించాం. ఇది అర్థం చేసుకుని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జనసేన శ్రేణులు కూటమి అభ్యర్థుల విజయం కోసం పనిచేస్తున్నారు. వైసీపీ అభ్యర్థులు ఒక్కరు కూడా గెలవకుండా చూడాలి. గౌరవప్రదమైన కుటుంబం నుంచి వచ్చిన ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డికే వైసీపీలో గౌరవం కరువైంది. మనసు చంపుకొని అక్కడ ఉండలేక టీడీపీలోకి వచ్చారు. జగన్‌ అహంకారానికి ఇదే నిదర్శనం.

Updated Date - May 04 , 2024 | 03:42 AM