మత రాజకీయంతో యువతను రెచ్చగొడ్తున్న బీజేపీ
ABN , Publish Date - May 01 , 2024 | 11:26 PM
మంత్రి దామోదర్ రాజనర్సింహ
జోగిపేట, మే 1: రాజకీయ పబ్బాన్ని గడుపుకునేందుకు బీజేపీ కులాలు, మతాలపరంగా విభజించి యువతను రెచ్చగొడ్తున్నదని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆరోపించారు. బుధవారం జోగిపేట మండలంలోని డాకూరులో నిర్వహించిన కాంగ్రెస్ అందోలు మండల విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. బీజేపీ విసురుతున్న ఉచ్చులో పడొద్దని, అభివృద్ధిని మాత్రమే చూడాలని యువతను కోరారు. రాష్ట్ర అభివృద్ధి కేవలం కాంగ్రె్సతోనే సాధ్యమని అన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చేందుకు సీఎం రేవంత్రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కంకణబద్ధంగా పనిచేస్తున్నదన్నారు. సభా ప్రాంగణానికి వచ్చిన మహిళల వద్దకు వెళ్లిన మంత్రి దామోదర్ వారిని ఆప్యాయంగా పలకరించారు. మహిళల కోసం ప్రభుత్వం చేపట్టిన పథకాల అమలుపై అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మండల కేంద్రమైన మునిపల్లి, పెద్దలోడి, తక్కడ పల్లి, చిన్నచెల్మెడ, అల్లాపూర్, చీలపల్లి, కల్లపల్లి బేలూర్, గార్లపల్లి గ్రామాలకు చెందిన బీఆర్ఎస్ నేతలు దామోదర్ సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. కార్యక్రమంలో మార్క్ఫెడ్ రాష్ట్ర డైరెక్టర్ శేరి జగన్మోహన్రెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్ పద్మనాభరెడ్డి, ఆత్మ కమిటీ మాజీ చైర్మన్ జోగిరెడ్డి, అక్సాన్పల్లి సొసైటీ చైర్మన్ జీఆర్. నరేందర్రెడ్డి, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు శివరాజ్యాదవ్ పాల్గొన్నారు.