ఐడీబీఐ బ్యాంక్ లాభంలో 44% వృద్ధి
ABN , Publish Date - May 05 , 2024 | 06:03 AM
ఈ ఏడాది మార్చితో ముగిసిన త్రైమాసికంలో ఐడీబీఐ బ్యాంక్ నికర లాభం వార్షిక ప్రాతిపదికన 44 శాతం పెరిగి రూ.1,628 కోట్లకు చేరుకుంది....
న్యూఢిల్లీ: ఈ ఏడాది మార్చితో ముగిసిన త్రైమాసికంలో ఐడీబీఐ బ్యాంక్ నికర లాభం వార్షిక ప్రాతిపదికన 44 శాతం పెరిగి రూ.1,628 కోట్లకు చేరుకుంది. మొత్తం ఆదాయం రూ.7,887 కోట్లకు పెరిగింది. గత ఏడాదిలో ఇదే కాలానికి బ్యాంక్ రూ.1,133 కోట్ల లాభం, రూ.7,014 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసింది. గత ఆర్థిక సంవత్సరం (2023-24) మొత్తానికి బ్యాంక్ నికర లాభం 55 శాతం వృద్ధితో ఆల్టైం గరిష్ఠ స్థాయి రూ.5,634 కోట్లకు, ఆదాయం రూ.30,037 కోట్లకు పెరిగింది. ఈ జనవరి-మార్చి త్రైమాసికంలో బ్యాంక్ నికర వడ్డీ ఆదాయం (ఎన్ఐఐ) 12 శాతం పెరిగి రూ.3,688 కోట్లుగా నమోదైంది. మార్చి 31 నాటికి బ్యాంక్ నికర నిరర్థక ఆస్తులు (ఎన్పీఏ) 0.34 శాతానికి తగ్గాయి. గత ఆర్థిక సంవత్సరానికి గాను బ్యాంక్ బోర్డు వాటాదారులకు ఒక్కో షేరుకు రూ.15 డివిడెండ్ చెల్లించాలని ప్రతిపాదించింది.