ఇంటర్ అడ్మిషన్ల కోసం మాయాజాలం
ABN , Publish Date - May 01 , 2024 | 11:07 PM
జిల్లా కేంద్రానికి చెందిన ఓ ప్రైవేట్ ఉద్యోగి కుమార్తె పదో తరగతి పరీక్ష రాసే సమయంలో కార్పొరేట్ విద్యాసంస్థలు అతడి కుమార్తె అడ్మిషన కోసం వెంటబడటం మొదలుపెట్టాయి.
సూర్యాపేట అర్బన, మే 1 : జిల్లా కేంద్రానికి చెందిన ఓ ప్రైవేట్ ఉద్యోగి కుమార్తె పదో తరగతి పరీక్ష రాసే సమయంలో కార్పొరేట్ విద్యాసంస్థలు అతడి కుమార్తె అడ్మిషన కోసం వెంటబడటం మొదలుపెట్టాయి. ముందస్తుగా చేరితో రాయితీ ఇస్తామని, అదేవిధంగా ఫీజులో కొంత చెల్లిస్తే మరికొంత రాయితీ ఉంటుందని ఆశ చూపించి కళాశాలలో చేరేలా చేశారు. ప్రస్తుతం కళాశాలకు అలవాటుపడాలని చెప్పి ఆనలైనలో పది రోజుల కిందటే తరగతులను ప్రారంభించారు.
కార్పొరేట్ విద్యాసంస్థలు అప్పుడే అడ్మిషన్ల ప్రక్రియను ప్రారంభించాయి. పదో తరగతి పరీక్షల సమయంలోనే విద్యార్థుల వివరాలను సేకరించిన కార్పొరేట్ కళాశాలల యజామాన్యాలు పది ఫలితాలు రావడంతో ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. ప్రతిభ కనబరిచిన విద్యార్థుల కోసం గాలిస్తున్నారు. అందుకోసం ప్రభుత్వ, ప్రైవేట్ ఉపాధ్యాయులను ఏజెంట్లుగా నియమించుకున్నారు. వారి ద్వారా విద్యార్థుల వివరాలను సేకరించి అడ్మిషన్ల కోసం తల్లిదండ్రుల వెంటపడుతున్నారు. విద్యార్థుల చిరునామాలను తెలుసుకొని వారి ఇళ్ల వద్దకు వెళ్తున్నారు. ఫలానా కళాశాల్లో చేర్పిస్తే ఉజ్వల భవిష్యత్ ఉంటుందని చెబుతున్నారు. ఇంటర్, ఎంసెట్, ఐఐటీ, జే ఈఈ ఫలితాలను వస్తాయని ప్రచారం చేస్తున్నారు. స్థానికంగా ఉన్న జూనియర్ కళాశాలల్లో మెరుగైన విద్యాబోధన ఉండడంలేదని, జాతీయ విద్యాసం్థల్లో సీట్లు, ఎంసెట్లో ర్యాంకులు సాధించాలంటే కార్పొరేట్ కళాశాలలకే సాధ్యమని ఏజెంట్లు నమ్మబలుకుతున్నారు. కళాశాల్లో చదివే మొత్తం విద్యార్థుల విష యాలకు బదులుగా ర్యాంకుల సాధించిన వారి వివ రాలు మాత్రమే వివరిస్తున్నారు. ఏజెంట్ల మాయాజాలానికి పట్టణ, గ్రామీణ ప్రాంతాలకు చెందిన విద్యార్థులు బలవుతున్నారు. ప్రతీ ఏటా కార్పొరేట్ల మాయాజాలానికి జిల్లాలోని 50శాతానికి పైగా విద్యార్థులు హైదరాబాద్, విజయవాడల్లోని పలు ఆయా కళాశాలల్లో అడ్మిషన్లు పొందుతున్నారు. ఇదిలా ఉండగా కార్పొరేట్ల ప్రచార సరళికి ప్రభుత్వ కళాశాలల విద్యార్థుల ఉత్తమ ఫలితాలు కనిపించకుండా పోతున్నాయి.
ముందస్తు అడ్మిషన్ ఫీజులు
కార్పొరేట్ జూనియర్ కళాశాలల యజమాన్యాలు విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ముందస్తు అడ్మిషన్ ఫీజును వసూలుచేస్తున్నారు. ఇవి ఏడాదికి రూ.లక్ష నుంచి రూ.3 లక్షల వరకు ఉన్నట్లు సమాచారం. ఏసీ, నాన్ఏసీ క్యాంప్సల పేరుతో ఫీజులను వసూలు చేస్తున్నారు. అంతేకాక పదో తరగతిలో మెరుగైన గ్రేడ్ సాధించిన విద్యార్థులకు ఫీజులో రాయితీఇస్తున్నారు. అదేవిధంగా అడ్మిషన్లకు ముందస్తు చెల్లించిన వారికి కూడా ఫీజులో రాయితీ ఇస్తుండటంతో కొంతమంది తల్లిదండ్రులు డబ్బులు చెల్లించి అడ్మిషన్ పొందుతున్నారు.
ప్రభుత్వ, ప్రైవేట్ ఉపాధ్యాయులే ఏజెంట్లు
హైదరాబాద్, విజయవాడ నగరాల్లోని పలు కార్పొరేట్ జూనియర్ కళాశాలల యజమాన్యాలు కొంతమందిని ఏజెంట్లను నియమించుకున్నారు. ఇందులో ఎక్కువగా ప్రభుత్వ, ప్రైవేట్ ఉపాధ్యాయులే ఏజెంట్లుగా పనిచేస్తున్నారు. ఒక్కో విద్యార్థిని కళాశాలల్లో చేర్పించినందుకు కొంతమొత్తంలో వారికి డబ్బులు ముట్టజెప్పుతున్నారు. వీరి ప్రయత్నాలతో జిల్లాలో విద్యనభ్యసించిన విద్యార్థుల్లో 50 శాతానికి పైగా విద్యార్థులు హైదరాబాద్, విజయవాడ నగరాల్లోని కళాశాలల్లో ఇంటర్ విద్యనభ్యసిస్తున్నారు. కొంతమంది విద్యార్థులు మాత్రమే జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లో చదువుతున్నారు.