నిప్పుల కొలిమి
ABN , Publish Date - May 01 , 2024 | 11:47 PM
ఉమ్మడి నల్లగొండ జిల్లా నిప్పుల కొలిమిని తలపిస్తోంది. ప్రజలే కాకుండా పశుపక్షాదులు కూడా నీటి కోసం తండ్లాడుతున్నాయి. బుధవారం ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 46.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
సెగలు కక్కుతున్న సూర్యుడు
ఉమ్మడి జిల్లాలో 46.6 డిగ్రీలు నమోదు
నల్లగొండ జిల్లాలో 22 మండలాల్లో రెడ్ అలర్ట్
నల్లగొండ, భువనగిరి అర్బన్, సూర్యాపేటటౌన్, మే 1: ఉమ్మడి నల్లగొండ జిల్లా నిప్పుల కొలిమిని తలపిస్తోంది. ప్రజలే కాకుండా పశుపక్షాదులు కూడా నీటి కోసం తండ్లాడుతున్నాయి. బుధవారం ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 46.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నల్లగొండ జిల్లాలో అత్యధికంగా ము నుగోడు మండలంలో 46.6 డిగ్రీలు, అత్యల్పంగా చింతపల్లి మండలం గొడకండ్లలో 39.9 డిగ్రీలు నమోదయ్యాయి. సూర్యాపేట జిల్లా మునగాలలో అత్యధికంగా 46.5 డిగ్రీలు, అత్యల్పంగా తుంగతుర్తిలో 41.0 డిగ్రీలు నమోదైంది. అనంతగిరిలో 46.3, పాలకీడులో 46.3, సూర్యాపేటలో 46.2, పెన్పహాడ్లో 46.0, మోతెలో 45.9, మట్టంపల్లి, మేళ్ళచెర్వులో 45.8, నూతనకల్ లో 45.7, ఆత్మకూర్(ఎ్స)లో 45.6, కోదాడలో 45.5, హుజూర్నగర్లో 45.5, గరిడేపల్లి, చివ్వెంలలో 45.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. జిల్లాలోని అన్ని మండలాల్లో 44డీగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదైంది. యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం)లో అత్యధికంగా 45.6 డిగ్రీలు, తుర్కపల్లిలో అత్యల్పంగా 41.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇదిలా ఉంటే నల్లగొం డ జిల్లాలో 22 మండలాల్లో ఉష్ణోగ్రతలు భారీగా నమోదు కావడంతో వా తావరణశాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. వడ గాడ్పులు.. నిప్పుల కొలిమిలో వెళ్లేందుకు వాహనదారులు భయపడుతున్నారు. భానుడి ప్రతాపానికి వడదెబ్బతో వృద్ధులు పిట్టల్లా రాలిపోతున్నారు. ఎండలు ముదరడంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారి వ్యాపారాలు కూడా డీలా పడుతుండగా రైతులు, కూలీలు, కార్మికులు ఎండలో ఇబ్బందులు పడుతున్నారు. మధ్యాహ్నం పని నిమిత్తం బయటకు వచ్చిన ప్రజలు ఎండ దెబ్బకు నిమ్మసోడ, చెరుకు రసం, పండ్ల రసాలు తాగి ఎండ నుంచి ఉపశమనం పొందుతున్నారు.
ఓఆర్ఎస్ ద్రావణాన్ని తాగించాలి : జగన్నాధచార్యులు, వైద్యుడు
డీహైడ్రేషన్కు గురైన వ్యక్తికి ప్రభుత్వం ఉచితంగా ఓ ఆర్ఎస్ ప్యాకెట్లు ఇస్తుంది. ఓఆర్ఎస్ (ఓరల్ డీహైడ్రేషన్ సొల్యూషన్)లో సోడియం క్లోరైడ్ 2.6గ్రాములు, పొటాషి యం క్లోరైడ్ 1.5గ్రాములు, సోడియం సిట్రెట్ 2.9గ్రాములు, చక్కెర 13.5 గ్రాములు ఉంటుంది. ఇవన్ని కలిసిన ఓఆర్ఎస్ ద్రావణాన్ని తీసుకుంటే డీహైడ్రేషన్ నుంచి బయటపడవచ్చు. ద్రావణాన్ని కలిపే ముందు చేతులు శుభ్రం చేసుకోవాలి. ఒక లీటర్ నీటిలో మొత్తం ప్యాకెట్ను కలపాలి. కలిపిన ఓఆర్ఎ్స ను 24 గంటల లోపు వినియోగించాలి. నీళ్ల విరేచనం అయిన ప్రతీ సారి ఈ ద్రావణాన్ని ఇవ్వాలి. రెండేళ్ల లోపు పిల్లలకు పావు గ్లాస్, 2-10 ఏళ్ల లోపు పిల్లలకు అర గ్లాస్, 10 ఏళ్లు దాటిన వారికి ఎంత తాగితే అంత ఇవ్వా లి. డీహైడ్రేషన్కు గురికాకుండాఉండేందుకు, వేసవి తపాన్ని త ట్టుకునేందుకు శరీరంలో నీటి శాతాన్ని ఎప్పటికప్పటికీ పెంచుకుంటే మంచిది. ఎక్కువగా ద్రవ పదార్థాలు, నీరు అధికంగా ఉండే పండ్లు, మజ్జిగ, కొబ్బరి నీరు తీసుకోవడం ఉత్తమం.
గత ఏడాది, ఈ ఏడాది ఏప్రిల్లో ఉష్ణోగ్రతల్లో వ్యత్యాసం ఇలా..
2023 ఏప్రిల్లో ఈ ఏడాది ఏప్రిల్లో
తేదీ గరిష్ఠం కనిష్ఠం గరిష్ఠం కనిష్ఠం
20న 41.0 24.0 40.0 24.8
21న 40.0 24.4 41.0 25.2
22న 38.0 21.4 41.5 24.4
23న 37.5 21.0 42.0 24.0
24న 37.0 22.0 41.5 24.4
25న 39.0 22.4 42.5 24.8
26న 38.5 20.0 43.0 24.6
27న 37.0 21.0 41.5 24.8
28న 38.0 22.0 45.5 25.0
29న 35.0 23.0 42.0 25.2
30న 35.5 22.4 43.0 25.4
వడదెబ్బతో ప్రాణానికి ముప్పు
వేసవిలో అప్రమత్తంగా ఉండాలంటున్న వైద్యులు
కోదాడ, మే 1: రో జురోజుకూ పెరుగుతున్న భానుడి భగభగలతో ప్రజలు అల్లాడుతున్నారు. వడదెబ్బతో ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని, ఈ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాల ని వైద్యులు సూచిస్తున్నారు. ఎండ వేడిమికి శరీరం డీహైడ్రేషన్కు గురయ్యే ప్రమాదం అధికం. వడదెబ్బతో నీళ్లు, రక్త విరేచనాలు, వాంతులు ఎక్కువైనప్పుడు శరీరం డీహైడ్రేషన్కు గురవుతుంది. పెద్దలతో పోలిస్తే చిన్న పిల్లలు అధికంగా డీహైడ్రేషన్కు గురయ్యే అవకాశం ఉంది. వాంతులు, విరేచనాలు, మూత్రం తరుచుగా రావడం, అసలు రా కుంటే జాగ్రత్తగా ఉండాలని వైద్యులు పేర్కొంటున్నారు. డీహైడ్రేషన్ లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇలా..
డీహైడ్రేషన్ లక్షణాలు
మూత్రం ముదురు పసుపు పచ్చ రంగులో వస్తుంది.
అకస్మాత్తుగా బరువు తగ్గుతారు. శరీరం పొడిబారుతుంది.
లోతుకుపోయిన చమ్మలేని కళ్లు ఉంటాయి.
చంటి పిల్లల మాడు లోపలికి పోతుంది.
శరీరం సాగే శక్తిని కోల్పోతుంది.
చర్మాన్ని రెండు వేళ్లతో (బోటన, చూపుడు) పైకి లాగినప్పుడు ముడత యథాస్థానానికి వెంటనే వెళ్లక నెమ్మదిగా వెళ్తే డీహైడ్రేషన్గా గుర్తించాలి.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
డీహైడ్రేషన్కు గురైన వ్యక్తి నీరు, మజ్జిగ, తదితర పానీయాలు అధికంగా తీసుకోవాలి.
విరేచనాలు అవుతున్న వ్యక్తికి వాంతులు అవుతున్నా, కాకపోయినా ఎక్కువగా ద్రవ పదార్థాలు ఇవ్వాలి.
డీహైడ్రేషన్ అయిన వ్యక్తికి పగలు, రాత్రి తేడా లేకుండా ప్రతీ 5నిమిషాలకు ఓఆర్ఎస్ ద్రావణాన్ని అందిస్తూ ఉండాలి. 8 పెద్దవారికి 3లీటర్లు, చిన్న వారికి లీటరు ద్రావణాన్ని ఇవ్వాలి.
లీటర్ మరగకాచి చల్లార్చిన నీటిలో రెండు పెద్ద స్పూన్ల పంచదార లేదా తేనె, పావు స్పూన్ ఉప్పు, పావు స్పూన్ వంట సోడా లేదా, అర స్పూన్ ఉప్పు కలిపిన నీటిని తాగించాలి. వీలైతే అరకప్పు నారింజ రసం, నిమ్మ రసం ఈ నీటిలో కలిపి ప్రతీ 5నిమిషాలకు ఒకసారి ఇస్తూ ఉండాలి.
చిన్న పిల్లలు దాహం అని చెప్పరు కనుక తల్లిదండ్రులే మాటి మాటికి నీటిని తాగించాలి.
డీహైడ్రేషన్కు గురైనవారికి వాంతులు అవుతున్నా సరే ద్రావణం ఇవ్వడం నిలపొద్దు. వాంతులు అయితే కొద్ది కొద్దిగా ద్రావణాన్ని తాగించాలి.