బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యాంగం రద్దు!
ABN , Publish Date - May 01 , 2024 | 11:28 PM
రాజ్యాంగ రక్షణకు బీజేపీని ఓడించాలి మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు సంజీవ
నిజాంపేట, మే 1: బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని రద్దు చేస్తామంటూ ఆ పార్టీ నాయకులు అంటున్నారని, డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ రచించిన రాజ్యాంగాన్ని రక్షించుకునేందుకు ఎంపీ ఎన్నికల్లో బీజేపీని ఓడించాలని మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు కల్లూరు సంజీవ అన్నారు. నిజాంపేట మండల కేంద్రంలో బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని రద్దు చేసి, మనువాదాన్ని తీసుకొచ్చే ప్రమాదం ఉన్నందున అధికారంలోకి రాకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఓట్లతో అడ్డుకోవాలని కోరారు. రాముని పేరు చెప్పి ఓట్లు అడుక్కోవడం కాదని అభివృద్ధి చేసి ఓట్లు అడగాలని బీజేపీ నాయకులకు సూచించారు. హిందువులకు అనుకూలంగా ఉన్నామని చెబుతున్న బీజేపీ నాయకులు రైతు చట్టాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని రైతులంతా హిందువులేనని గుర్తు చేశారు. ఈ సమావేశంలో నర్సాపూర్ మాల మహానాడు మండలాధ్యక్షుడు గోవు యాదగిరి, జిల్లా కార్యదర్శి దుబాసి సంజీవ్, జిల్లా యూత్ అధ్యక్షుడు దాడిగా నరేష్, మెదక్ జిల్లా మాల మహానాడు ఉపాధ్యక్షుడు తాళ్ల ఆనంద్కుమార్, నిజాంపేట మండలాధ్యక్షుడు బండారి చంద్రయ్య, మండల ఉపాధ్యక్షుడు బ్యాగరి రాజు తదితరులు పాల్గొన్నారు.