Share News

నేడు సిద్దిపేటకు సీఎం రేవంత్‌రెడ్డి

ABN , Publish Date - May 01 , 2024 | 11:47 PM

లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సిద్దిపేట పట్టణానికి రానున్నారు.

నేడు సిద్దిపేటకు సీఎం రేవంత్‌రెడ్డి

పట్టణంలో రోడ్‌షో, అంబేడ్కర్‌ సర్కిల్‌ వద్ద పబ్లిక్‌ మీటింగ్‌

భారీ బందోబస్తు ఏర్పాటు

అధికారులకు, సిబ్బందికి సీపీ అనురాధ దిశానిర్దేశం

సిద్దిపేట క్రైం, మే 1: లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సిద్దిపేట పట్టణానికి రానున్నారు. ముందుగా పట్టణంలోని బీజేఆర్‌ చౌరస్తా నుంచి రోడ్‌షో చేపట్టనున్నారు. అనంతరం సిద్దిపేట పాత బస్టాండ్‌ అంబేడ్కర్‌ సర్కిల్‌ వద్ద పబ్లిక్‌ మీటింగ్‌లో ఆయన పాల్గొననున్నారు. ఈ మేరకు సిద్దిపేట పోలీస్‌ కమిషనర్‌ అనురాధ హెలీప్యాడ్‌, రోడ్‌షో, పబ్లిక్‌ కార్నర్‌ మీటింగ్‌, వాహనాల పార్కింగ్‌, వీఐపీ రూట్‌మ్యాప్‌ తదితర ప్రదేశాలను పరిశీలించి అధికారులకు, సిబ్బందికి బందోబస్తు సంబంధించి దిశానిర్దేశం చేశారు. ట్రాఫిక్‌, పార్కింగ్‌ వద్ద విధుల్లో ఉన్న సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రోడ్‌షోకు వచ్చే ప్రజలకు ఇబ్బంది కలగకూడదన్నారు. బందోబస్తుకొచ్చిన అధికారులు, సిబ్బంది రోడ్‌షో, సభ పూర్తయి ప్రజలందరూ వెళ్లిన తర్వాతనే వెళ్లాలని స్పష్టం చేశారు.

పార్కింగ్‌ అక్కడే..

మీటింగ్‌ వచ్చే వారు తమ వాహనాలను బాలాగౌడ్‌ ఫంక్షన్‌హాల్‌, ఎన్సాన్‌పల్లి ఎక్స్‌ రోడ్డు, వేములవాడ కమాన్‌ ఎదురుగా ఉన్న గ్రౌండ్‌, రంగధాంపల్లిచౌరస్తా పక్కన్న ఉన్న గ్రౌండ్‌లో పార్క్‌ చేసి పాత బస్టాండ్‌ ఆవరణకు రావాలని సీపీ తెలిపారు. సిద్దిపేట పట్టణంలోకి వచ్చే వాహనాలు ముస్తాబాద్‌ చౌరస్తా, నర్సాపూర్‌ క్రాస్‌రోడ్డు, విపంచి ఎల్‌ఐసీ ఆఫీస్‌ రోడ్డు, రంగధాపల్లి చౌరస్తా నుంచి డైవర్షన్‌ తీసుకోవాలని సీపీ సూచించారు.

Updated Date - May 01 , 2024 | 11:47 PM