ప్రతీ ఒక్కరికి ఓటరు స్లిప్పులు అందించాలి
ABN , Publish Date - May 01 , 2024 | 11:20 PM
ప్రతీ ఓటరుకు సమాచార స్లిప్పులను అందించేందుకు బూత్ స్ధాయి అధికారులు కృషి చేయాలని జిల్లా ఎన్నికల అధికారి బీఎం సంతోష్ అన్నారు.
- వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా ఎన్నికల అధికారి బీఎం సంతోష్
గద్వాల న్యూటౌన్, మే 1 : ప్రతీ ఓటరుకు సమాచార స్లిప్పులను అందించేందుకు బూత్ స్ధాయి అధికారులు కృషి చేయాలని జిల్లా ఎన్నికల అధికారి బీఎం సంతోష్ అన్నారు. బ్యాలెట్ ముద్రణ, హోం ఓటింగ్, ఓటరు స్లిప్పుల పంపిణీ తదితర ఆంశాలపై రాష్ట్ర ఎన్నికల అధికారి వికాస్రాజ్, ఇతర ఉన్నతాధికారులతో కలిసి బుధవారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోటీలో ఉన్న అభ్యర్ధుల సంఖ్య ఆధారంగా, అవసరమైన అదనపు బ్యాలెట్ యూనిట్లను సిద్ధం చేసుకోవాలని, ర్యాండమైజేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. ఎన్నికల యంత్రాలపై బ్యాలెట్ పత్రాల కమిషనింగ్కు ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి బీఎం సంతోష్ స్పందిస్తూ ఓటరు తుది జాబితాను రూపొందించామని, ఓటరు సమాచార స్లిప్పులను ప్రతి ఓటరుకు అందేలా బూత్స్ధాయి అధికారులతో పంపిణీ చేయిస్తున్నామని తెలిపారు. హోం ఓటింగ్, పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునే వారి వివరాలను ఓటరు జాబితాలో సృష్టంగా మార్కు చేశామన్నారు. జిల్లాలో ఓటరు గుర్తింపు కార్డులను త్వరతిగతిన పంపిణీ చేస్తామని తెలిపారు. పోస్టల్ బ్యాలెట్ ఓటర్ల కోసం ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఫెసిలిటేషన్ కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. హోమ్ ఓటింగ్ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు అవసరమైన బృందాలను ఏర్పాటు చేశామని తెలిపారు. మే మూడు నుంచి హోమ్ ఓటింగ్ ప్రక్రియను ప్రారంభించనున్నట్లు తెలిపారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేస్తున్నామన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు అపూర్వచౌహాన్, ముసిని వెంకటేశ్వర్లు, ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు నరేష్ పాల్గొన్నారు.