ఉపాధి పనులపై నమ్మకం కల్పించాలి
ABN , Publish Date - May 01 , 2024 | 10:57 PM
ఉపాధి హామీ పనులపై కూలీలకు నమ్మకం కల్పించి, దినసరి కూలి రూ.300 పడేలా పనిచేయించాలని రాష్ట్ర పంచాయితీరాజ్ డిప్యూటీ కమిషనర్ రవీందర్ అన్నారు.
- రూ.300 కూలి పడేలా పని చేయించాలి
- పంచాయతీరాజ్ డిప్యూటీ కమిషనర్ రవీందర్
నర్వ, మే 1 : ఉపాధి హామీ పనులపై కూలీలకు నమ్మకం కల్పించి, దినసరి కూలి రూ.300 పడేలా పనిచేయించాలని రాష్ట్ర పంచాయితీరాజ్ డిప్యూటీ కమిషనర్ రవీందర్ అన్నారు. బుధవారం మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ఎన్ఆర్ఈజీఎస్ నియోజకవర్గ అధికారుల సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సమావేశానికి మక్తల్, ధన్వాడ, నర్వ మండలాల నుంచి ఎంపీడీవోలు, ఎంపీవోలు, సీసీలు, టీఏలు, నర్వ పంచాయతీ కార్యదర్శి పాల్గొన్నారు. అంతకుముందు మండలంలోని కూమార్ లింగంపల్లిలో చెరువులో ఒండ్రు మట్టి పూడిక తీత పనులతో పాఉ నర మినీ నర్సరీని పరిశీలించారు. మొక్కలను బాగా పెరిగేందుకు నీటి సౌకర్యాలను ఏర్పాటు చేయాలన్నారు. ఉపాధి కూలీలు చేస్తున్న ఫీడర్ చానల్ పనులను పరిశీలించి, దినసరి కూలి ఎంత పడుతుందని కూలీలను అడిగారు. ఈ సందర్భంగా కూలీలు రూ.150 నుంచి రూ.180 వరకు పడుతోందని తెలుపగా, రోజు కూలి రూ.300 పడేలా పనులు చేయించాలని ఈజీఎస్ అధికారులకు సూచించారు. అనంతరం ఎంపీడీవో కార్యాలయంలో అధికారులతో ఈజీఎస్ పనులు, గ్రామ పంచాయతీ అంశాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశంలో ప్రత్యేకాధికారి నర్సింగ్రావు, ఎంపీడీవోలు సుదర్శన్, సాయిప్రకాష్, ఏపీవో మొగులప్ప పాల్గొన్నారు.