‘పది’ఫలితాల్లో భేష్
ABN , Publish Date - May 01 , 2024 | 12:48 AM
పదోతరగతి ఫలితాల్లో రాజన్న సిరిసిల్ల జిల్లా మెరుగైన ఫలితాలు సాధించింది. మంగళవారం ప్రకటించిన ఫలితాల్లో 2023-24 విద్యా సంవత్సరం 98.27 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలో మూడో స్థానంలో నిలిచింది. గత సంవత్సరం 94.37 శాతంతో రాష్ట్రంలో ఆరోస్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. గతేడాది 66 మంది విద్యార్థులకు 10 జీపీఏ వస్తే ఈ సారి ఫలితాల్లో 111 మంది విద్యార్థులు 10 జీపీఏ సాధించారు.
(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)
పదోతరగతి ఫలితాల్లో రాజన్న సిరిసిల్ల జిల్లా మెరుగైన ఫలితాలు సాధించింది. మంగళవారం ప్రకటించిన ఫలితాల్లో 2023-24 విద్యా సంవత్సరం 98.27 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలో మూడో స్థానంలో నిలిచింది. గత సంవత్సరం 94.37 శాతంతో రాష్ట్రంలో ఆరోస్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. గతేడాది 66 మంది విద్యార్థులకు 10 జీపీఏ వస్తే ఈ సారి ఫలితాల్లో 111 మంది విద్యార్థులు 10 జీపీఏ సాధించారు.
జిల్లాలో 6,358 మంది విద్యార్థులు పాస్
జిల్లాలో 6470మంది విద్యార్థులు పది పరీక్షలకు హాజరవగా 6358 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. 3079 మంది బాలురకు 3000 మంది, 3391 మంది బాలికలకు 3358 మంది ఉత్తీర్ణులయ్యారు. 98.27 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. బాలురు 97.43 శాతం, బాలికలు 99.03 శాతం ఉన్నారు.
బాలికలే ముందంజ
జిల్లాలో పదోతరగతిలో ఉత్తీర్ణత సాధించిన వారిలో మరోసారి బాలికలే ముందంజలో నిలిచారు. బాలురు 3 వేల మంది, బాలికలు 3358 మంది ఉత్తీర్ణులవగా బాలికలు 358 మంది ఎక్కువగా ఉన్నారు. జిల్లాలో 111 మంది 10 జీపీఏ సాధించగా బాలురు 34 మంది, బాలికలు 77 మంది ఉన్నారు.
112 మంది ఫెయిల్
జిల్లాలో ఈ సంవత్సరం పది ఫలితాల్లో 112 మంది ఉత్తీర్ణత సాధించలేకపోయారు. 3079 మంది బాలురు పరీక్షలకు హాజరవగా 79 మంది, 3391 మంది పరీక్షలకు హాజరవగా 33 మంది ఫెయిల్ అయ్యారు. విద్యార్థులు రీకౌంటింగ్ కోసం రూ.500, రీ వెరిఫికేషన్ కోసం రూ.వెయ్యి చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చు. ఫెయిలైన విద్యార్థులకు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను జూన్ 3వ తేదీ నుంచి 13వ తేదీ వరకు నిర్వహించనున్నారు.
గురుకులాల్లో మెరిసిన విద్యార్థులు
గురుకుల పాఠశాలలతోపాటు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారు. 14 పాఠశాలలు ఉత్తమ ఫలితాలను సాధించాయి. ఇందులో 12 మంది 10 జీపీఏ పొందారు. గతేడాది కంటే ఈ సారి ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తీర్ణత శాతం పెరిగింది.
విద్యార్థులను అభినందించిన ఎస్పీ, అదనపు కలెక్టర్, డీఈవో
జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో 10 జీపీఏతోపాటు ఉత్తమ జీపీఏలు సాధించిన విద్యార్థులను ఎస్పీ అఖిల్మహాజన్, అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్, డీఈవో రమేష్కుమార్ అభినందించారు. ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు సంబరాలు జరుపుకున్నారు.
మెరుగైన ఫలితాలు
- ఎ.రమేష్, జిల్లా విద్యాధికారి
జిల్లాలో పదోతరగతిలో ఈ సంవత్సరం గతేడాది కంటే మెరుగైన ఫలితాలు వచ్చాయి. రాష్ట్రంలో జిల్లా మూడో స్థానంలో నిలిచింది. 98.27 శాతం ఉత్తీర్ణత సాధించారు. మంచి ఫలితాలు రావడం సంతోషకరంగా ఉంది.