Delhi: డీప్ఫేక్ వీడియోలపై ఢిల్లీ హైకోర్టులో ‘పిల్’
ABN , Publish Date - May 02 , 2024 | 04:23 AM
రిజర్వేషన్లపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా వ్యాఖ్యలను వక్రీకరించారన్న వివాదం నేపథ్యంలో ‘డీప్ఫేక్’ వీడియోలపై ఢిల్లీ హైకోర్టులో పిల్ దాఖలైంది.
న్యూఢిల్లీ, మే 1(ఆంధ్రజ్యోతి): రిజర్వేషన్లపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా వ్యాఖ్యలను వక్రీకరించారన్న వివాదం నేపథ్యంలో ‘డీప్ఫేక్’ వీడియోలపై ఢిల్లీ హైకోర్టులో పిల్ దాఖలైంది. లోక్సభ ఎన్నికలను ప్రభావితం చేస్తున్నందున డీప్ఫేక్ వీడియోల వ్యాప్తిని, ప్రసారాన్ని అరికట్టేలా ఎన్నికల కమిషన్ను ఆదేశించాలని న్యాయవాదుల బృందం ఈ పిల్లో కోరింది.
సీనియర్ న్యాయవాది జయంత్ మెహతా బుధవారం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మన్మోహన్, జస్టిస్ మన్మీత్ ప్రీతమ్సింగ్ అరోరాతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ముందు ఈ పిటిషన్ గురించి ప్రస్తావించారు. డీప్ఫేక్ వీడియోలపై ఫిర్యాదు చేసినప్పటికీ ఈసీ స్పందించలేదన్నారు. ఎన్నికల వేళ చక్కర్లు కొడుతున్న డీప్ఫేక్ వీడియోలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని తెలిపారు. దీనిపై స్పందించిన ధర్మాసనం పిటిషన్ సక్రమంగా ఉంటే గురువారం విచారణ చేపడతామని తెలిపింది.