Share News

ముక్కోణపు పోరుగల్లు!

ABN , Publish Date - May 02 , 2024 | 06:05 AM

ఉద్యమాల గడ్డ.. పోరాటాల ఖిల్లా. తెలంగాణ ఉద్యమానికి ఊపిరులూదిన నేల. పీవీ నర్సింహారావు వంటి రాజకీయ ఉద్ధండుణ్ని పార్లమెంటుకు పంపించిన ప్రాంతం. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత బీఆర్‌ఎస్‌ తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించిన వరంగల్‌ లోక్‌సభ నియోజకవర్గం.. ఇప్పుడు ముక్కోణపు పోటీకి

ముక్కోణపు పోరుగల్లు!

వరంగల్‌లో ప్రధాన పార్టీల త్రిముఖ పోరు..

ముగ్గురు అభ్యర్థులకూ ఎంపీ ఎన్నిక తొలిసారే

36 ఏళ్ల తరువాత మహిళకు చాన్సిచ్చిన కాంగ్రెస్‌

‘హ్యాట్రిక్‌’ పట్టు సడలవద్దని బీఆర్‌ఎస్‌ ఆరాటం

40 ఏళ్ల తరువాత గట్టి పోటీ ఇస్తున్న బీజేపీ

అసెంబ్లీ ఎన్నికల్లో ఆరు చోట్ల గెలిచిన కాంగ్రెస్‌

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, వరంగల్‌)

ఉద్యమాల గడ్డ.. పోరాటాల ఖిల్లా. తెలంగాణ ఉద్యమానికి ఊపిరులూదిన నేల. పీవీ నర్సింహారావు వంటి రాజకీయ ఉద్ధండుణ్ని పార్లమెంటుకు పంపించిన ప్రాంతం. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత బీఆర్‌ఎస్‌ తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించిన వరంగల్‌ లోక్‌సభ నియోజకవర్గం.. ఇప్పుడు ముక్కోణపు పోటీకి వేదికైంది. మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులూ తొలిసారి పార్లమెంటు బరిలో నిలవడంతో ఓరుగల్లులో ఆసక్తికర పోరు సాగుతోంది. పైగా.. బీఆర్‌ఎస్‌ అభ్యర్థితోపాటు కాంగ్రెస్‌, బీజేపీ అభ్యర్థులు కూడా గులాబీ పార్టీ నుంచి ఆయా పార్టీలోకి వెళ్లినవారే కావడంతో ఇక్కడ ఎన్నిక ప్రాధాన్యం సంతరించుకుంది.

నాటకీయ పరిణామాల మధ్య కాంగ్రెస్‌ అభ్యర్థిగా ఎంపికైన డాక్టర్‌ కడియం కావ్య తొలిసారిగా ఎన్నికల్లో పోటీకి దిగుతున్నారు. రాజకీయాలకు ఆమె కొత్త అయినా.. మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్‌ఘనపూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి వారసురాలిగా రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఇక బీజేపీ అభ్యర్థి అరూరి రమేశ్‌కు గత రెండు పర్యాయాలు వర్ధన్నపేట ఎమ్మెల్యేగా పని చేసిన అనుభవం ఉంది. 2014, 2018లో బీఆర్‌ఎస్‌ తరఫున వర్ధన్నపేట ఎమ్మెల్యేగా గెలిచారు. ఇటీవల బీజేపీలో చేరి ఎంపీగా పోటీ చేస్తున్నారు. కాగా, బీఆర్‌ఎస్‌ అభ్యర్థి మారేపల్లి సుధీర్‌కుమార్‌ హనుమకొండ జడ్పీ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. ముగ్గురు అభ్యర్థులూ స్థానిక సమస్యలే ప్రధాన ఎజెండాగా ప్రచారం చేస్తున్నారు.


కాంగ్రెస్‌కు ప్రతిష్ఠాత్మకం..

వరంగల్‌ లోక్‌సభ స్థానం కాంగ్రె్‌సకు ప్రతిష్ఠాత్మకంగా మారింది. రాష్ట్రంలో అధికారంలో ఉండటంతో పాటు గత అసెంబ్లీ ఎన్నికల్లో వరంగల్‌ పార్లమెంట్‌ పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో ఆరింటిని కాంగ్రెస్సే గెలుచుకుంది. బీఆర్‌ఎస్‌ తరఫున గెలిచిన ఒక్క ఎమ్మెల్యే కడియం శ్రీహరి కూడా కాంగ్రె్‌సలో చేరారు. ఈ నేపథ్యంలో వరంగల్‌ ఎంపీ స్థానాన్ని కాంగ్రెస్‌ తప్పక గెలవాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటోంది. దీంతో వ్యూహాత్మకంగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి కూతురు కడియం కావ్యకే కాంగ్రెస్‌ టికెట్‌ ఇచ్చింది. ఈ స్థానం నుంచి 36 ఏళ్ల తరువాత తొలిసారిగా మహిళా అభ్యర్థిని బరిలోకి దించింది. ఇక్కడి నుంచి 1984లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన డాక్టర్‌ టి.కల్పనాదేవి ఎంపీగా విజయం సాధించారు. ఆ తరువాత 1998లో ఆమె కాంగ్రె్‌సలో చేరి ఆ పార్టీ తరఫున పోటీ చేశారు. కానీ, టీడీపీ అభ్యర్థి చందులాల్‌ చేతిలో ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి కాంగ్రెస్‌ పార్టీ మహిళకు వరంగల్‌ లోక్‌సభ టికెట్‌ కేటాయించలేదు. మళ్లీ ఇప్పుడు డాక్టర్‌ కావ్యకు టికెట్‌ ఇచ్చింది. కాగా, వరంగల్‌ సీటుపై సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టారు. కాంగ్రెస్‌ అభ్యర్థిని గెలిపిస్తే వరంగల్‌ నగరంలో అండర్‌ డ్రెయినేజీతో పాటు వరంగల్‌లో ఎయిర్‌పోర్టును, మెగా టెక్స్‌టైల్‌ పార్కును అభివృద్ధి చేస్తామని, ఇండస్ర్టియల్‌ కారిడార్‌ ఏర్పాటుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. పార్టీలోకి నేతల వలసలతో మరింత బలపడ్డామని కాంగ్రెస్‌ అంచనా వేస్తోంది.


40 ఏళ్ల తరువాత బీజేపీ ఆశలు

బీజేపీ తెలంగాణలో గెలుస్తామని అంచనా వేస్తున్న సీట్లలో వరంగల్‌ ఒకటిగా చెప్పుకొంటున్నారు. 1984లో ఇక్కడి (హనుమకొండ) నుంచి చందుపట్ల జంగారెడ్డి గెలిచాక.. మళ్లీ ఏ ఎన్నికల్లోనూ బీజేపీ గట్టి పోటీ ఇవ్వలేకపోయింది. 40 ఏళ్ల తరువాత మళ్లీ ఇప్పుడు బీజేపీకి గెలుపు ఆశలు చిగురించాయి. కాగా, తనను గెలిపిస్తే.. వరంగల్‌ నగరానికి ఎయిర్‌పోర్టును నెలరోజుల్లో తీసుకువస్తానని, నగరంలో అండర్‌ డ్రెయినేజీకి, ఐటీ పార్కులు, స్మార్ట్‌ సిటీ, హెరిటేజ్‌ సిటీగా అభివృద్ధి చేయటంతో పాటు మెగా టెక్స్‌టైల్‌ పార్కుకు నిధులు తీసుకువస్తానని, భూపాలపల్లికి రైల్వేలైన్‌ ఏర్పాటు చేయిస్తాననే హామీలిస్తూ అరూరి రమేశ్‌ ప్రజల్లోకి వెళుతున్నారు.


పట్టు సడలకుండా బీఆర్‌ఎస్‌ వ్యూహం..

తెలంగాణ ఉద్యమ సమయం నుంచి వరంగల్‌ ప్రజలు బీఆర్‌ఎ్‌సకు అండగా నిలుస్తున్నారు. నియోజకవర్గాల పునర్విభజన తరువాత 2009 ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలవగా, ఆ తరువాత 2014 ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి కడియం శ్రీహరి గెలుపొందారు. అనంతరం 2015 ఉప ఎన్నికలు, 2019 ఎన్నికల్లో పసునూరి దయాకర్‌ బీఆర్‌ఎస్‌ తరఫున గెలిచారు. దీంతో బీఆర్‌ఎస్‌ ఇక్కడ హ్యాట్రిక్‌ కొట్టింది. అయితే ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ఓడాక.. కీలక నేతలు పార్టీని వీడటం, అభ్యర్థిగా ప్రకటించిన కడియం కావ్య కూడా కాంగ్రె్‌సలో చేరడంతో గులాబీ శ్రేణులు అయోమయానికి గురయ్యాయి. ఈ నేపథ్యంలో పార్టీ పట్టు సడలకుండా మాజీ మంత్రి ఎర్రబెల్లికి ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించి, హనుమకొండ జడ్పీ చైర్మన్‌ సుధీర్‌కుమార్‌ను బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా నిలిపారు. నాలుగోసారి కూడా గులాబీ జెండా ఎగురవేస్తామనే ధీమాతో ఉన్నారు.


ddd.jpg


muku.jpg

Updated Date - May 02 , 2024 | 06:08 AM