4 నుంచి పోస్టల్ బ్యాలెట్ సమరం
ABN , Publish Date - May 02 , 2024 | 12:50 AM
ఎన్టీఆర్ జిల్లావ్యాప్తంగా ఎన్నికల విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటేయడానికి 13,901 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈనెల 4, 5, 6 తేదీల్లో పోస్టల్ బ్యాలెట్ నిర్వహించనున్నారు.
ఎన్టీఆర్ జిల్లావ్యాప్తంగా 13,901 మంది ఉద్యోగుల దరఖాస్తు
(ఆంధ్రజ్యోతి, విజయవాడ): ఎన్టీఆర్ జిల్లావ్యాప్తంగా ఎన్నికల విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటేయడానికి 13,901 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈనెల 4, 5, 6 తేదీల్లో పోస్టల్ బ్యాలెట్ నిర్వహించనున్నారు. నందిగామ నియోజకవర్గానికి చెందిన 2,690 మంది ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోవడానికి ఫాం-12లను అందించారు. మైలవరం నుంచి 2,102 మంది, తిరువూరు నుంచి 2,008 మంది, విజయవాడ తూర్పు నుంచి 1,905, జగ్గయ్యపేట నుంచి 1,622, విజయవాడ పశ్చిమ నుంచి 1,174, సెంట్రల్ నియోజకవర్గం నుంచి 1,028 మంది ఉద్యోగులు ఫాం-12లను అందిం చారు. ఎన్టీఆర్ జిల్లాలో ప్రస్తుతం ఎన్నికల విధులు నిర్వహిస్తున్న రాష్ట్రంలోని ఇతర జిల్లాలకు చెందిన ఉద్యోగులు 1,372 మంది తమ నియోజకవర్గాల పరిధిలో ఎన్టీఆర్ జిల్లా నుంచే పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటేయడానికి ఫాం-12లను సమర్పించారు. పోలింగ్ విధులు నిర్వహిస్తున్న ఉద్యోగుల్లో తొంభై శాతానికి పైగా ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. పోలింగ్ ఆఫీసర్లు (పీవో), సహాయ పోలింగ్ ఆఫీసర్లు(ఏపీవో) 9,204 మంది ఓటు హక్కు వినియో గించుకోవటానికి ఫాం-12లను అందించారు. పోలింగ్లో పాలు పంచుకునే ఇతర అధికారులు సెక్టార్ ఆఫీసర్లు, బీఎల్వోలు, డ్రైవర్లు 1,575 మంది, మైక్రో అబ్జ ర్వర్లుగా నియమించిన వారిలో 243 మంది ఫాం- 12లను సమర్పించారు. 2,362 మంది పోలీసులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునేందుకు దరఖాస్తు చేసుకున్నారు. ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్, ఎక్స్ సర్వీస్మెన్ విభాగాలకు చెందిన వారు 517 మంది ఫాం-12 సమర్పించారు.
ఏవీఈఎస్ పోస్టల్ బ్యాలెట్కు 1,011 దరఖాస్తులు
ఆబ్సెంటీ ఓటర్స్ ఆన్ ఎసెన్షియల్ సర్వీసెస్(ఏవీఈఎస్) కింద 1,011 మంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటేయడానికి దరఖాస్తు చేసుకున్నారు. విద్యుత్, బీఎస్ ఎన్ఎల్, ఆలిండియా రేడియో, రైల్వే, తపాలా, టెలిగ్రామ్, దూరదర్శన్, వైద్యా రోగ్యశాఖ, విమానయానశాఖ, రోడ్ ట్రాన్స్పోర్ట్, మీడియా, అంబులెన్స్ సర్వీసెస్ అందించే వారంతా పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటేస్తారు.
7, 9 తేదీల్లో హోమ్ ఓటింగ్
ఈనెల 7, 9వ తేదీల్లో హోమ్ ఓటింగ్ను నిర్వహించనున్నారు. ఎన్టీఆర్ జిల్లావ్యాప్తంగా 1,047 మంది హోమ్ ఓటింగ్కు దరఖాస్తు చేసుకున్నారు. వృద్ధుల్లో 85 ఏళ్లకు పైబడినవారు, 40 శాతం మించి అంగవైకల్యం కలిగిన వారు హోమ్ ఓటింగ్ కోసం జిల్లా ఎన్నికల యంత్రాంగానికి ఫాం-12 డీలను సమర్పించారు. ఓటర్ల ఇంటికే వెళ్లి హోమ్ ఓటింగ్ను నిర్వహించనున్నారు. ఇది కూడా రహస్య విధానంలో పోస్టల్ బ్యాలెట్గానే నిర్వహించనున్నారు. పోలీసు బందోబస్తు, ఎన్నికల సిబ్బంది పర్యవేక్షణలోనే జరుగుతుంది.