చెరువు.. చెరవీడి
ABN , Publish Date - May 02 , 2024 | 01:00 AM
వందేళ్ల కిందటి మాట.. అది గుడివాడలోని నాగవరప్పాడు గ్రామం. పచ్చగా కళకళలాడే ఆ గ్రామాన్ని కలరా వ్యాపించి ఎంతోమందిని పొట్టన పెట్టుకుంది. వరుస మరణాలతో తల్లడిల్లిపోయిన గ్రామ పెద్దలు సమస్యకు ఓ పరిష్కారం కావాలని నిర్ణయించుకున్నారు. నాటి ఆచార సంప్రదాయాలను అనుసరించి గ్రామానికి ఈశాన్యంలో చెరువు ఉంటే మంచిదనుకున్నారు. గ్రామస్థులందరి కృషితో 90 సెంట్ల విస్తీర్ణంలో చెరువు తవ్వుకున్నారు. నాటి గ్రామస్థుల నమ్మకమో, మరే ఇతర కారణమో తెలియదు కానీ చెరువు తవ్విన నాటి నుంచి గ్రామంలో మరణాలు తగ్గడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.
నాగవరప్పాడువాసుల సెంటిమెంట్ చెరువు కబ్జా
సీఎం సిద్ధం సభ కోసం పూడ్చేసిన కొడాలి గ్యాంగ్
వందేళ్ల కిందట గ్రామంలో వరుస మరణాలు
పెద్దల ఆలోచనతో ఈశాన్యంలో చెరువు తవ్వకం
ఆ తర్వాత తగ్గిన మరణాలతో ఉపశమనం
‘సిద్ధం’ సభ తరువాత మళ్లీ వరుస మరణాలు
స్థానికుల ఫిర్యాదుతో దిగొచ్చిన ఎమ్మెల్యే కొడాలి నాని
చెరువు పూడ్చి యథాస్థానానికి..
వందేళ్ల కిందటి మాట.. అది గుడివాడలోని నాగవరప్పాడు గ్రామం. పచ్చగా కళకళలాడే ఆ గ్రామాన్ని కలరా వ్యాపించి ఎంతోమందిని పొట్టన పెట్టుకుంది. వరుస మరణాలతో తల్లడిల్లిపోయిన గ్రామ పెద్దలు సమస్యకు ఓ పరిష్కారం కావాలని నిర్ణయించుకున్నారు. నాటి ఆచార సంప్రదాయాలను అనుసరించి గ్రామానికి ఈశాన్యంలో చెరువు ఉంటే మంచిదనుకున్నారు. గ్రామస్థులందరి కృషితో 90 సెంట్ల విస్తీర్ణంలో చెరువు తవ్వుకున్నారు. నాటి గ్రామస్థుల నమ్మకమో, మరే ఇతర కారణమో తెలియదు కానీ చెరువు తవ్విన నాటి నుంచి గ్రామంలో మరణాలు తగ్గడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.
ప్రస్తుత పరిస్థితి.. కాలక్రమంలో ఆ చెరువు స్థానికులు బట్టలు ఉతుక్కునేందుకు, శ్మశానంలో నిర్వహించే కర్మకాండలకు, పశువుల తాగునీటికి అనుకూలంగా మారింది. గతనెల 15వ తేదీన వైసీపీ అధినేత జగన్ ‘మేమంతా సిద్ధం’ సభ కోసం ఈ చెరువును పూడ్చేశారు. సభ జరిగి 15 రోజులవుతున్నా పూడ్చిన మట్టిని తొలగించలేదు. ఈ క్రమంలో గ్రామంలో మళ్లీ మరణాలు మొదలయ్యాయనే ఆరోపణలు వెల్లువెత్తాయి. వీటికి ఊతమిస్తూ ఎలాంటి అనారోగ్య కారణాలు లేని ఐదుగురు మృతిచెందడం ఇప్పుడు స్థానికుల్లో కలవరానికి కారణమైంది.
గుడివాడ : నాగవరప్పాడు గ్రామంలోని చెరువు వెనుక పక్కన ఉన్న 12 ఎకరాలను రెండేళ్ల కిందట అసలు యజమానిని బెదిరించి స్థానిక ఎమ్మెల్యే కొడాలి నాని గ్యాంగ్ వశం చేసుకుంది. కొడాలి నాని తమ్ముడు నాగేశ్వరరావు (చిన్ని) పేరున కొంత, మరో వ్యక్తి పేరున కొంత భూమిని రిజిస్టర్ చేయించారు. ఎటువంటి అనుమతులు లేకుండా లే అవుట్ కూడా వేశారు. ప్లాట్లు వేసి విక్రయించేందుకు అణువుగా ప్రభుత్వ భూమిని ఆక్రమిస్తూ వంతెన నిర్మించారు. పశుపోషకులు అభ్యంతరాలు తెలిపినా ఏ ఒక్క అధికారి పట్టించుకోలేదు. కాగా, గతనెల 15వ తేదీన వైసీపీ అధినేత జగన్ ‘మేమంతా సిద్ధం’ సభ నిర్వహించారు. సభకు రాకపోకలు సాగించేందుకు చెరువు, కాల్వను పూడ్చేశారు. సభ జరిగిన 15 రోజులవుతున్నా పూడ్చిన మట్టిని తొలగించకపోవడంతో స్థానికుల్లో ఆందోళన మొదలైంది.
సెంటిమెంట్ చెరువు
సిద్ధం సభ అనంతరం స్థానికులు ఐదుగురు ఆకస్మికంగా మృతి చెందటంతో అలజడి మొదలైంది. అనాదిగా ఈ చెరువు నాగవరప్పాడువాసులకు సెంటిమెంట్గా ఉంది. అకస్మాత్తుగా చెరువును పూడ్చివేయడంతోనే వీరు మృతిచెందారని పెద్దలు ఆరోపిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో చెరువును తిరిగి యథాస్థానానికి తీసుకురావాలని తీర్మానించుకున్నారు. పలుమార్లు ఎమ్మెల్యే నానీని కోరారు. పట్టించుకోకపోవడంతో పెద్దలు లోయ శివాజీ, వసంతవాడ దుర్గారావు, కొలుసు రాజా, సూర్యచంద్రరావుతో పాటు పలువురు ఆర్డీవో, జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఎన్నికల వేళ స్థానికుల నుంచి వచ్చిన ప్రతిఘటన నానీని ఆలోచనలో పడేసింది. దీంతో బుధవారం పూడ్చిన చెరువును తిరిగి చెరువుగా మార్చారు.
నానీకి ఝలక్
ఎమ్మెల్యేగా, మంత్రిగా రాజభోగాలు అనుభవించిన నాని తన అనుచరులతో నియోజకవర్గంలో కబ్జాపర్వానికి తెరలేపారు. కాగా, తనకు పట్టున్న ప్రాంతంగా కొడాలి నాని చెప్పుకొనే నాగవరప్పాడులో చెరువు వ్యవహారం వివాదాస్పదమై తిరుగుబావుటా ఎగరడంతో నాని ఝలక్కే తగిలింది.