ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలి
ABN , Publish Date - May 02 , 2024 | 12:46 AM
ఎటువంటి ప్రలోభాలకు, బయాందోళనకు గురికాకుండా ప్రతిఒక్కరూ స్వేచ్ఛగా ఓటుహక్కును వినియోగించుకోవాలని సబ్ కలెక్టర్ ఆశుతోష్ శ్రీవాస్తవ అన్నారు. బుధవారం కొవ్వూరులో శ్రీరామకాలనీ, రాజీవ్కాలనీ, మెరకవీధి వాటర్ట్యాంకు సెంటర్ రౌండ్ పార్కు, అచ్చాయమ్మకాలనీ వరకు సీఐఎస్ఎఫ్ బలగాలతో కవాతు నిర్వహించారు.
డీఎస్పీ రామారావు.. కొవ్వూరులో కేంద్ర బలగాల కవాతు
కొవ్వూరు, మే 1: ఎటువంటి ప్రలోభాలకు, బయాందోళనకు గురికాకుండా ప్రతిఒక్కరూ స్వేచ్ఛగా ఓటుహక్కును వినియోగించుకోవాలని సబ్ కలెక్టర్ ఆశుతోష్ శ్రీవాస్తవ అన్నారు. బుధవారం కొవ్వూరులో శ్రీరామకాలనీ, రాజీవ్కాలనీ, మెరకవీధి వాటర్ట్యాంకు సెంటర్ రౌండ్ పార్కు, అచ్చాయమ్మకాలనీ వరకు సీఐఎస్ఎఫ్ బలగాలతో కవాతు నిర్వహించారు. ఆర్డీవో కార్యాలయం వద్ద సబ్ కలెక్టర్ కవాతులో పాల్గొని బలగాలకు సూచనలు చేశారు. సీఐ వి.జగదీశ్వరరావు మాట్లాడుతూ ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేందుకు కొవ్వూరుకు 86 మంది రాజస్తాన్ ఆర్మ్డ్ పోలీసులు వచ్చారన్నారు. ఎటువంటి భయం లేకుండా ప్రతి ఓటరు పోలింగ్ కేంద్రానికి వచ్చి స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలనే లక్ష్యంతో కొవ్వూరు, గోపాలపురం, నిడదవోలు నియోజకవర్గాల్లో కేంద్ర బలగాల కవాతు నిర్వహించినట్టు చెప్పారు. ఎవరైనా ప్రలోభపెట్టినా, భయాందోళనకు గురిచేసినా స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయాలన్నారు. కవాతులో ఎస్ఐలు జుబేర్ మహామ్మద్, కె.సురేష్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
తుది విడత ఈవీఎంల ర్యాండమైజేషన్ పూర్తి: సబ్ కలెక్టర్
సార్వత్రిక ఎన్నికల సందర్భంగా కొవ్వూరు అసెంబ్లీ సెగ్మెంట్కు సంబం ధించి రెండో విడత (తుది విడత) ఈవీఎంల ర్యాండమైజేషన్ పూర్తిచేసినట్టు రిటర్నింగ్ అధికారి ఆశుతోష్ శ్రీవాస్తవ తెలిపారు. బుధవారం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఎలకా్ట్రనిక్ ఓటింగ్ మిషన్లు, బ్యాలెట్, కంట్రోల్ యూనిట్స్, వీవీ ప్యాడ్స్, ర్యాండమైజేషన్ కార్యక్రమాన్ని నియోజకవర్గ పరిశీలకులు, పలు రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో నిర్వహించామన్నారు. నియోజకవర్గంలోని 176 పోలింగ్ కేంద్రాలకు 211 బ్యాలెట్ యూనిట్లు, 211 కంట్రోల్ యూనిట్లు, 228 వీవీ ప్యాడ్లను కేటాయించామన్నారు.