కేంద్ర బలగాలు వచ్చేశాయ్
ABN , Publish Date - May 02 , 2024 | 03:09 AM
సార్వత్రిక ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించడానికి వీలుగా కేంద్ర ప్రభుత్వం అత్యంత సమస్యాత్మక నియోజకవర్గాలకు కేంద్ర బలగాలను మొహరించింది.
శ్రీకాళహస్తి, చంద్రగిరి, గూడూరుకు కేటాయింపు
తిరుపతి(నేరవిభాగం), మే 1: సార్వత్రిక ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించడానికి వీలుగా కేంద్ర ప్రభుత్వం అత్యంత సమస్యాత్మక నియోజకవర్గాలకు కేంద్ర బలగాలను మొహరించింది. ఇప్పటికే తిరుపతికి బోర్డర్ సెక్యూరిటీ ఫోర్సు మూడు కంపెనీలు అంటే దాదాపు 240 మంది నెల కిందటే చేరుకున్నారు. వారు అన్ని పోలీసుస్టేషన్ల పరిధిలో ప్లాగ్ మార్చ్ చేస్తూ మేమున్నామని ఓటర్లలో ఆతస్థైర్యం నింపుతున్నారు. రోజు రోజుకూ కొన్ని నియోజకవర్గాల్లో శాంతి భద్రతల సమస్యలు తలెత్తడం, ప్రచారాల్లో ఘర్షణ నెలకొనడం, ఇరు పార్టీలూ కేంద్ర ఎన్నికల కమిషన్కు ఫిర్యాదులు చేసుకోవడంతో జిల్లాకు మరిన్ని కేంద్ర బలగాలు వచ్చాయి. రెండ్రోజుల కిందట అండమాన్ నికోబార్ దీవుల నుంచి సీఆర్ఫీఎఫ్ బలగాలు మూడు కంపెనీలు అంటే 225 మంది తిరుపతికి చేరుకున్నారు. వీరితోపాటు సీఐఎ్సఎఫ్ బలగాలు మరో మూడు కంపెనీలు అంటే దాదాపు 230 మంది జిల్లాకు వచ్చారు. వీరంతా శాంతి భద్రతల విషయమై సంబంఽధిత అధికారులతో సమావేశం అవుతున్నారు. ఆ తర్వాత వీరిని జిల్లాలో అత్యంత సమస్యాత్మక ప్రాంతాలైన గూడూరు, శ్రీకాళహస్తి, చంద్రగిరి నియోజకవర్గాలకు పంపనున్నారు. ప్రస్తుతం ఈ నియోజకవర్గాల్లో ఎలాంటి వాతావరణం ఉంది.. ఘర్షణలు, విధ్వంసాలు, దాడులు, పోలింగ్ కేంద్రాల్లోకి వెళ్లి ఈవీఎంలు అపహరించడం వంటి ఘటనలు ఎక్కడ జరిగే అవకాశం ఉందన్న వివరాలు తెలుసుకుంటున్నారు. మరోవైపు గత ఎన్నికల్లో ఎలాంటి కేసులు నమోదయ్యాయి అన్న కోణంలోనూ ఆరా తీస్తున్నారు. మరో రెండు, మూడ్రోజుల్లో ఈ మూడు నియోజకవర్గాల్లో కేంద్ర బలగాలు భారీ ఎత్తున మొహరించనున్నారు. ఆ తర్వాత ప్రతి పోలింగ్ కేంద్రాన్ని నిశితంగా తనిఖీ చేస్తారు.