నేటి నుంచి భగభగలే!
ABN , Publish Date - Mar 25 , 2026 | 06:06 AM
రాష్ట్రంలో ఇక వేసవి తీవ్రరూపం దాల్చనుంది. రానున్న వారం రోజులు పలు ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని ఏపీ రియల్టైమ్ గవర్నెన్స్ మంగళవారం వెల్లడించింది.
పెరగనున్న వడగాడ్పులు
అత్యవసరమైతే తప్ప మధ్యాహ్నం
బయటికి రావొద్దు: ఆర్టీజీఎస్
కర్నూలులో 39 డిగ్రీలు నమోదు
అమరావతి/విశాఖపట్నం, మార్చి 24(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఇక వేసవి తీవ్రరూపం దాల్చనుంది. రానున్న వారం రోజులు పలు ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని ఏపీ రియల్టైమ్ గవర్నెన్స్ మంగళవారం వెల్లడించింది. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసరమైతే తప్ప.. బయటకు రాకుండా ఉంటే మంచిదని సూచించింది. వృద్ధుల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొంది. సోమవారం కోస్తా, రాయలసీమల్లో ఎండ తీవ్రత పెరిగింది. కర్నూలులో 39, అనంతపురంలో 38.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అక్కడక్కడ వర్షాలు కురవగా, ఈదురుగాలుల వల్ల విద్యుత్ అంతరాయం ఏర్పడింది. రానున్న 24 గంటల్లో కోస్తా, సీమలతోపాటు ఉత్తరాంధ్రలో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.