Weather Department: మూడు రోజుల్లో ఈశాన్య రుతుపవనాల నిష్క్రమణ
ABN , Publish Date - Jan 14 , 2026 | 04:48 AM
ఈశాన్య రుతుపవనాలు రానున్న మూడు రోజుల్లో తమిళనాడు, కోస్తాంధ్ర, రాయలసీమ, కేరళ, కర్ణాటక నుంచి నిష్క్రమించనున్నాయి.
విశాఖపట్నం, జనవరి 13(ఆంధ్రజ్యోతి): ఈశాన్య రుతుపవనాలు రానున్న మూడు రోజుల్లో తమిళనాడు, కోస్తాంధ్ర, రాయలసీమ, కేరళ, కర్ణాటక నుంచి నిష్క్రమించనున్నాయి. ప్రస్తుతం దక్షిణ భారతదేశంపైకి వీచే గాలుల దిశ మారడంతో రుతుపవనాలు వైదొలిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కాగా, కోస్తా, రాయలసీమల్లో అనేకచోట్ల మంగళవారం మంచు కొనసాగింది. శివారు ప్రాంతాలు, ఏజెన్సీలో చలి తీవ్రత పెరిగింది. రానున్న రెండు, మూడు రోజుల్లో చలి తీవ్రత పెరుగుతుందని, అనేక ప్రాంతాల్లో మంచు కురుస్తుందని వాతావరణ శాఖ తెలిపింది. సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణాలు సాగించేవారు ఉదయం, రాత్రి వేళల్లో అప్రమత్తంగా ఉండాలని సూచించింది.