Share News

కష్టంతో కాదు ఇష్టంతో చదవాలి

ABN , Publish Date - Aug 28 , 2026 | 10:30 PM

విద్యార్థులు కష్టంతో కాకుండా ఇష్టంతో చదవాలని జిల్లా అదనపు కలెక్టర్‌, ఇన్‌చార్జీ డీఈవో చంద్రయ్య అన్నారు. శుక్రవారం మల్కేపల్లి గిరిజన ఆశ్రమ పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.

కష్టంతో కాదు ఇష్టంతో చదవాలి
విద్యార్థులతో మాట్లాడుతున్న అదనపు కలెక్టర్‌ చంద్రయ్య

కాసిపేట, ఆగస్టు 28 (ఆంధ్రజ్యోతి) : విద్యార్థులు కష్టంతో కాకుండా ఇష్టంతో చదవాలని జిల్లా అదనపు కలెక్టర్‌, ఇన్‌చార్జీ డీఈవో చంద్రయ్య అన్నారు. శుక్రవారం మల్కేపల్లి గిరిజన ఆశ్రమ పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చదువు పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా ఆసక్తిగా చదువుకోవాలన్నారు. ఉన్నత లక్ష్యాలను ఎంచుకుని చదవితే మంచి స్థాయికి చేరుకుంటారన్నారు. అలాగే ప్రభుత్వం సంక్షేమ హాస్ఠళ్ల నిర్వహణ కోసం అనేక నిధులను ఖర్చు చేస్తుందని, విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. చదువులో వెనకబడిన వారిని గుర్తించి చదువు చెప్పాలని, మెను ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని ఉపాధ్యాయులకు సూచించారు. అనంతరం సోనాపూర్‌ గ్రామంలో నిర్వహిస్తున్న సర్‌ ప్రక్రియను పరిశీలించి పలు సూచనలు చేశారు. ఆయన వెంట తహసీల్దార్‌ సునీల్‌కుమార్‌దేశ్‌పాండే, ఎంఈవో వెంకటేశ్వర స్వామి, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి అనిత, ఎంపీడీవో సత్యనారాయణసింగ్‌, ఎంపీవో సప్దర్‌అలీ, సర్పంచులు రఘుపతి, మహేందర్‌, హెచ్‌ఎం భీంరావు, ఉపాధ్యాయులు ఉన్నారు.

Updated Date - Aug 28 , 2026 | 10:30 PM