11న గుట్ట దేవస్థాన ట్రస్ట్ బోర్డు ప్రమాణం
ABN , Publish Date - Jul 08 , 2026 | 07:05 AM
సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్, సభ్యుల ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారైంది.
నేడు సీఎం రేవంత్తో చైర్మన్, ధర్మకర్తల సమావేశం
యాదాద్రి, జూలై 7(ఆంధ్రజ్యోతి): సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్, సభ్యుల ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారైంది. చైర్మన్తోపాటు 18 మంది సభ్యులు జూలై 11న ప్రధాన ఆలయ ముఖమండపంలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. వీరితో ఆలయ కార్యనిర్వహణాధికారి జె.భవానీశంకర్ ప్రమాణస్వీకారం చేయిస్తారు. తిరుమల తిరుపతి దేవస్థాన ధర్మకర్తల మండలి తరహాలోనే ఈ ప్రమాణ స్వీకారం జరగబోతోంది. ట్రస్ట్ బోర్డు అధికారులు ఈ కార్యక్రమానికి అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా, దేవస్థాన ధర్మకర్తల మండలి చైర్మన్గా నియమితులైన మన్నె సత్యనారాయణరెడ్డి, సభ్యులు బుధవారం సీఎం రేవంత్రెడ్డిని కలవబోతున్నారు. ఈ సమావేశంలో ఆలయ అభివృద్ధి ప్రణాళికలు, భక్తులకు వసతి సదుపాయాలతో పాటు పలు విధివిధానాలపై సీఎం దిశానిర్దేశం చేస్తారని సమాచారం.