మహిళల్లో నిరుద్యోగం తగ్గుతోంది: కిషన్రెడ్డి
ABN , Publish Date - Jan 31 , 2026 | 04:16 AM
మహిళల ఉపాధి అవకాశాలు దశాబ్ద కాలంలో గణనీయంగా పెరిగాయని కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
హైదరాబాద్, జనవరి 30 (ఆంధ్ర జ్యోతి): మహిళల ఉపాధి అవకాశాలు దశాబ్ద కాలంలో గణనీయంగా పెరిగాయని కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ‘ఆర్థిక సర్వే 2025-26’లో మహిళల నిరుద్యోగం పెరుగుదలపై ఇచ్చిన గణాంకాలను శుక్రవారం ఆయన ఎక్స్లో పోస్టు చేశారు. మహిళా సాధికారతలో భారత్ సాధిస్తున్న ప్రగతిని ఈ సందర్భంగా కిషన్ రెడ్డి వివరించారు. 2017-18లో కేవలం 23.3 శాతంగా ఉన్న మహిళా కార్మిక భాగస్వామ్య రేటు, 2023-24 నాటికి 41.7 శాతానికి పెరిగిందన్నారు. అదే సమయంలో మహిళల్లో నిరుద్యోగ రేటు 5.6 శాతం నుంచి 3.2 శాతానికి తగ్గిందని పేర్కొన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలో అమలు చేసిన వినూత్న కార్యక్రమాలే ఈ పురోగతికి కారణమని కిషన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. నగరాల్లో సురక్షిత రవాణా సౌకర్యాలు, రాత్రి వేళల్లో పనిచేసే మహిళల రక్షణకు తీసుకున్న జాగ్రత్తలు, అంగన్వాడీ వ్యవస్థ బలోపేతం వంటి అంశాలు మహిళలు ఉపాధి వైపు అడుగులు వేయడానికి దోహదపడ్డాయని ఆయన స్పష్టం చేశారు.