ఉచిత బస్సుకు జై కొట్టిన మహిళలు
ABN , Publish Date - Feb 10 , 2026 | 04:59 AM
మునిసిపల్ ఎన్నికల్లో భాగంగా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సదాశివపేటలోని 26వార్డుల ప్రజలతో ముఖాముఖి సభ ఏర్పాటు చేశారు.
కొత్త రేషన్కార్డులు, ఉచిత విద్యుత్, సన్న బియ్యం, ఇతర పథకాలు అందుతున్నాయని కాంగ్రె్సకు కితాబు
సదాశివపేటలో ముఖాముఖి నిర్వహించిన జగ్గారెడ్డి
పదేళ్లలో చేయలేని పనులు రాహుల్ నాయకత్వంలో రేవంత్ రెండేళ్లలోనే చేశారని బీఆర్ఎస్ నేతలకు ఈర్ష్య
సంగారెడ్డి ప్రజలది, నాది ఆవుదూడ అనుబంధం: జగ్గారెడ్డి
సదాశివపేట, ఫిబ్రవరి 9 (ఆంధ్రజ్యోతి): మునిసిపల్ ఎన్నికల్లో భాగంగా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సదాశివపేటలోని 26వార్డుల ప్రజలతో ముఖాముఖి సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాహుల్గాంధీ ఆదేశాలతో రేవంత్రెడ్డి ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం తెస్తే.. బస్సుల్లో కొట్లాటలు జరుగుతున్నాయని బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్రావు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. నిజంగానే బస్సులో కొట్లాటలు జరుగుతున్నాయా.. ఈ పథకం ఉండాలా.. వద్దా అని ప్రజలను జగ్గారెడ్డి ప్రశ్నించారు. దీంతో కొట్లాటలు లేవని, ఈ పథకం ఉండాలని మహిళలు చెయ్యెత్తి తమ అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. కాంగ్రెస్ హయాంలో సన్నబియ్యం, 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్, ఇతర సంక్షేమ పథకాలు సైతం అందుతున్నాయని మహిళలు కితాబు ఇచ్చారు. దీనిపై జగ్గారెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ వాళ్లు పదేళ్లలో చేయలేని పనులను రేవంత్రెడ్డి కేవలం రెండేళ్లలో చేసినందుకు వారు జీర్ణించుకోలేక పోతున్నారని ఎద్దేవా చేశారు. సంగారెడ్డి ప్రజలది, తనది ఆవుదూడ అనుబంధమని చెప్పారు. అభివృద్ధి, సంక్షేమం, ఇతర సహాయాల విషయంలో వారికి అన్ని విధాలా సహకరిస్తున్నానని వివరించారు.