మహిళా సాధికారతే లక్ష్యం
ABN , Publish Date - Jun 03 , 2026 | 01:05 AM
రాష్ట్ర ప్రభుత్వం మహిళా సాధికారతే లక్ష్యంగా ముందుకు సాగుతోందని రాష్ట్ర మైనార్టీ వెల్ఫేర్, పబ్లిక్ ఎంటర్ ప్రైజెస్ శాఖ మంత్రి మహ్మద్ అజహరుద్దీన్ అన్నారు. దేశంలోనే రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలిపేందుకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సర్కారు నిరంతరం కృషి చేస్తోందన్నారు. తెలంగాణ రైజింగ్- 2047 విజన్తో ప్రభుత్వం ముందుకు
జగిత్యాల, జూన్ 2 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం మహిళా సాధికారతే లక్ష్యంగా ముందుకు సాగుతోందని రాష్ట్ర మైనార్టీ వెల్ఫేర్, పబ్లిక్ ఎంటర్ ప్రైజెస్ శాఖ మంత్రి మహ్మద్ అజహరుద్దీన్ అన్నారు. దేశంలోనే రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలిపేందుకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సర్కారు నిరంతరం కృషి చేస్తోందన్నారు. తెలంగాణ రైజింగ్- 2047 విజన్తో ప్రభుత్వం ముందుకు సాగుతోందని పేర్కొన్నా అన్నారు. మంగళవారం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని జగిత్యాల సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో జరిగిన వేడుకల్లో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్తో కలిసి మంత్రి అజహరుద్దీన్ పాల్గొని జాతీయజెండాను ఆవిష్కరించారు. పలువురు స్వాతంత్రం సమరయోధుల చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. పోలీసు గార్డ్స్ ద్వారా వందన సమర్పణ స్వీకరించారు. అంతకుముందు తెలంగాణ అమర వీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మహ్మద్ అజహ రుద్దీన్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయక త్వంలో అభివృద్ధి, సంక్షేమం పరుగులు పెడుతోందన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు రూ.783 కోట్ల 70 లక్షల వడ్డీ లేని రుణాలను అందించామని మంత్రి వెల్లడించారు. స్త్రీ నిధి సంస్థ ద్వారా మహిళలకు ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.80 కోట్ల రుణాలు ఇచ్చామన్నారు. స్వశక్తి సంఘాల సభ్యులతో బస్సులు కొనుగోలు చేసి ఆర్టీసీ అద్దె ఒప్పందం, కోరుట్లలో పెట్రోల్ బంక్, సారంగాపూర్ మండలంలో సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. ఇందిరా మహిళా శక్తి పథకం కింద జిల్లాలో 381 వ్యక్తి గత యూనిట్లకు రూ.13.33 కోట్ల లక్ష్యం నిర్దేశించగా, 376 మహిళా సంఘాల వ్యక్తిగత యూనిట్లకు ఈ యేడాది రూ.8.75కోట్లు రుణాలు పంపిణీ చేశామన్నారు.
ఫ వీధి వ్యాపారులకు రూ.39.23 కోట్ల రుణాలు
జిల్లాలో ఐదు మున్సిపాలిటీల్లో 17,903 మంది వీధి వ్యాపారులను గుర్తించి రూ.39.23 కోట్ల రుణాలు అందించామని వెల్లడించారు. జిల్లాలో ఉచిత బస్సు రవాణా సౌకర్యాన్ని 7.69 కోట్ల మంది మహిళలు వినియోగించుకున్నారని తెలిపారు. రూ. 318.99 కోట్ల లబ్ధి పొందారన్నారు. గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్లలోపు విద్యుత్ వాడే వినియోగదారులందరికి జీరో బిల్లులు జారీ చేస్తోందన్నారు. జిల్లాలో 2,10,376 సర్వీసులకు గాను రూ.167.11 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించిందని తెలిపారు. మహిళా, శిశు, దివ్యాంగుల, వయో వృద్ధుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి అన్నారు. జిల్లాలో 1,065 అంగన్వాడీ కేంద్రాల ద్వారా 11,758 మంది గర్భిణులు, బాలింతలకు, 30,282 టీహెచ్ఆర్ చిన్నారులకు, 14,102 మంది పిల్లలకు పోషకాహారం అందజేస్తున్నామని తెలిపారు. దివ్యాంగులకు రిట్రో ఫిట్టేడ్ మోటార్ వాహనాలు, ల్యాప్ టాప్లు, బ్యాటరీ ఆపరేటెడ్ వీల్ చైర్లు, ట్రై సైకిళ్ళు అందిస్తున్నామన్నారు. 50 పడకల ప్రభుత్వ వయోవృద్ధుల సదనాన్ని రూ.125 కోట్ల వ్యయంతో నిర్మించి ప్రారంభించామన్నారు.
ఫప్రజాపాలన-ప్రగతి ప్రణాళికతో ముందుకు..
ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికతో మరింత ముందుకు వెళ్తున్నామని మంత్రి అజహరుద్దీన్ తెలిపారు. ఈకార్యక్రమంలో భాగంగా సంక్షేమ పథకాలు జిల్లాలో విజయవంతంగా అమలవుతున్నాయని పేర్కొన్నారు. గ్రామం నుంచి జిల్లా స్థాయి వరకు పరిశుభ్రత, పెండింగ్ ఫైల్స్ క్లియరెన్స్, ఆరోగ్యం, రోడ్డు సేఫ్టీ, సంక్షేమం, పిల్లల భద్రత, రైతు సంక్షేమ, మహిళలు, యువత, క్రీడలు, పర్యావరణం తదితర పది అంశాలతో కూడిన కార్యక్రమాలను అందరి భాగస్వామ్యంతో నిర్వహిస్తున్నామని తెలిపారు.
ఫపేదలకు ఇందిరమ్మ ఇళ్లు..
జిల్లాలో అర్హులైన లబ్ధిదారులకు 10,860 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామని పేర్కొన్నారు. ఇప్పటికే 7,745 ఇళ్ల నిర్మాణాల్లో 1,274 ఇల్లు పూర్తి అయ్యాయని, రూ. 202.53 కోట్లు చెల్లించడం జరిగిందన్నారు. అర్హులైన 25,617 రేషన్ కార్డులలో 86,024 మంది సభ్యులకు రేషన్ కార్డులు అందించామని తెలిపారు. ప్రతి నెల సన్న బియ్యం పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.
ఫరైతు సంక్షేమానికి కృషి
జిల్లాలో యాసంగి 2025-26 సీజన్లో 444 ఽధాన్యం కొనుగోలు కేంద్రాల్లో 3.97 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని మంత్రి పేర్కొన్నారు.రూ. 745.13 కోట్ల డబ్బులను నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేశామని తెలిపారు. ఇందిరమ్మ రైతు భరోసా పథకం ద్వారా యాసంగి 2025-26 గాను 2,30,014 మంది రైతులకు రూ. 166.16 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేశామన్నారు. రైతు బీమా ద్వారా ఇప్పటి వరకు జిల్లాలో మరణించిన రైతు కుటుంబాలకు రూ.271.02 కోట్ల ఆర్థిక చేయూత కల్పించామని తెలిపారు.
ఫవిద్యాభివృద్ధికి చర్యలు
జిల్లాలో విద్యాభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని మంత్రి పేర్కొన్నారు. 2026-27 విద్యా సంవత్సరం నుంచి ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్ వరకు విద్యార్థులకు నాణ్యమైన పోషకాలతో నూతనంగా బ్రేక్ ఫాస్ట్ పథకాన్ని ప్రారంభిస్తున్నామని వెల్లడించారు. తెలంగాణ పబ్లిక్ స్కూళ్లను, యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూళ్లను నియోజకవర్గానికి ఒక్కటి చొప్పున జిల్లాలో మూడు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.
ఫప్రైవేట్కు దీటుగా ప్రభుత్వ ఆసుపత్రులు..
జిల్లాలో ప్రైవేట్ ఆసుపత్రులకు దీటుగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక వసతులు కల్పిస్తున్నామన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇప్పటి వరకు 5,056 ప్రసవాలు జరగ్గా అందులో 1,384 సాధారణ ప్రసవాలు చేశామన్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద 2025-26 ఆర్థిక సంవత్సరంలో 1,07,065 మందికి రూ.49.21 కోట్ల విలువ చేసే శస్త్ర చికిత్సలు ఉచితంగా చేశామన్నారు. జిల్లాలో భూ భారతి చట్టంలో భాగంగా నక్ష లేని 20 గ్రామాలు ఎంపిక చేసి సర్వే పనులు చేపట్టామన్నారు. కార్యక్రమంలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, కలెక్టర్ బి. సత్యప్రసాద్, ఎస్పీ అశోక్ కుమార్, అదనపు కలెక్టర్ రాజాగౌడ్, ఆర్డీఓ మదు సూదన్, డీఆర్డీఓ రఘువరన్, జిల్లా పంచాయతీ అధికారి మదన్ మోహన్, మున్సిపల్ కమిషనర్ దుర్గపు శ్రీనివాస్ గౌడ్, తహసీల్ధార్ హకీం, జిల్లా గ్రంథాలయ చైర్మన్ సంగనభట్ల దినేష్, ఆర్డీవోలు, జగిత్యాల మున్సిపల్ చైర్మన్ సమిండ్ల వాణి శ్రీనివాస్, డీసీసీ అధ్యక్షుడు గాజంగి నందయ్య, టీపీసీసీ సెక్రెటరీ బండ శంకర్, నాయకులు చాంద్పాషా, స్థానిక ప్రజాప్రతినిధులు, జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.
ఫమహిళా సంఘాల సభ్యులకు రుణాల పంపిణీ
జిల్లాలోని పలువురు స్వయం సహాయక మహిళా సంఘాల సభ్యులకు బ్యాంకు లింకేజీ రుణాలు, పలువురు లబ్ధిదారులకు ఆర్థిక సహాయ చెక్కులను మంత్రి అజహరుద్దీన్, ఎమ్మెల్యే డాక్టర్ మాకునూరి సంజయ్ కుమార్, కలెక్టర్ సత్య ప్రసాద్లు పంపిణీ చేశారు. జిల్లాలో డీఆర్డీఏ ఇందిరా కాంతి పథం 735 ఎస్హెచ్జీ మహిళలకు రూ. 73.52 కోట్ల బ్యాంకు లింకేజీ రుణాల జెంబో చెక్కును అందించారు. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) 46 స్వయం సహాయక మహిళా రూ. 6.09 కోట్ల రుణాల జెంబో చెక్కును పంపిణీ చేశారు. 25 మంది లబ్ధిదారులకు నేషనల్ ఫ్యామిటీ బెనిఫిట్ స్కీం కింద రూ. 20 వేల చొప్పున రూ.5 లక్షల ఆర్థిక సహాయం చెక్కును అందించారు. జిల్లాలో 65 గ్రామ పంచాయతీ పారిశుద్య కార్మికులకు సానిటేషన్ కిట్స్ పంపిణీ చేశారు.