ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్లో మహిళా మావోయిస్టు రూపిరెడ్డి మృతి
ABN , Publish Date - Apr 14 , 2026 | 04:51 AM
ఛత్తీస్గఢ్లోని కాంకేర్ జిల్లా అడవుల్లో సోమవారం ఉదయం జరిగిన ఎదురుకాల్పుల్లో మహిళా మావోయిస్టు రూపిరెడ్డి మృతి చెందింది. మచ్పల్లి అడవుల్లో మావోయిస్టులున్నారనే ...
సిద్దిపేటకు చెందిన ఈమెపై రూ.5 లక్షల రివార్డు
రాష్ట్రం నుంచి అజ్ఞాతంలో ఉన్న ఐదుగురిలో రూపిరెడ్డి ఒకరు
చర్ల/దుబ్బాక/మిరుదొడ్డి, ఏప్రిల్ 13 (ఆంధ్రజ్యోతి): ఛత్తీస్గఢ్లోని కాంకేర్ జిల్లా అడవుల్లో సోమవారం ఉదయం జరిగిన ఎదురుకాల్పుల్లో మహిళా మావోయిస్టు రూపిరెడ్డి మృతి చెందింది. మచ్పల్లి అడవుల్లో మావోయిస్టులున్నారనే సమాచారంలో కేంద్ర బలగాలు కూబింగ్ నిర్వహిస్తుండగా ఎన్కౌంటర్ జరిగిన ట్లు పోలీసులు తెలిపారు. మరణించిన మావోయిస్టు రూపిరెడ్డిని అలియాస్ రంగబోయిన భాగ్యగా గుర్తించామని, మచ్పల్లి ఏరియా కమిటీ మెంబర్గా పని చేస్తోందన్నారు. తెలంగాణలోని సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండ లం, ధర్మారం గ్రామానికి చెందిన రూపిరెడ్డి 2 దశాబ్దాలుగా మావోయిస్టు పార్టీలో పని చేస్తోందని, ఆమెపై ప్రభుత్వం గతంలో రూ. 5 లక్షల రివార్డు ప్రకటించిందని కాంకేర్ పోలీసులు వెల్లడించారు. రూపిరెడ్డి భర్త దండకారణ్య స్పెషల్జోన్ కమిటీ సభ్యుడైన విజయ్ రెడ్డి గతేడాది మాన్పూర్ జిల్లా అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో మరణించాడు. భర్త మరణం తర్వాత రూపిరెడ్డి భద్రతా దళాలపై ప్రతీకారం తీర్చుకోవాలనే లక్ష్యంతో క్రియాశీలకంగా వ్యవహరిస్తోందనే ప్రచారం జరిగింది. చివరకు 8నెలల వ్యవధిలో భర్త మరణించిన ప్రాంతానికి సమీపంలోనే ఆమె కూడా ప్రాణాలు కోల్పోయింది. ఇంకా అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులు వెంటనే లొంగిపోవాలని బస్తర్ ఐజీ సుందర్ రాజ్ సూచించారు. గతంలో డీజీపీ శివధర్ రెడ్డి ప్రకటించిన అజ్ఞాతంలో ఉన్న ఐదుగురు తెలంగాణ మావోయిస్టుల జాబితాలో, రూపిరెడ్డి ఒకరు కావడం గమనార్హం.
తలవంచని భాగ్య
అజ్ఞాతంలో ఉన్న ముఖ్యనేతల జాబితాలో ఒకరిగా ఉన్న భాగ్య, చివరి వరకు అడవిని వీడలేదు. ఆమె ప్రస్థానం బాల్యం నుంచే అలుపెరగని పోరాటంతో ముడిపడి ఉంది. ధర్మారం గ్రామానికి చెందిన ఎల్లవ్వ, నరసయ్య దంపతుల పెద్ద కుమార్తె అయిన భాగ్య, చిన్నతనంలోనే పోలియో బారిన పడి అశక్తురాలైనా.. సామాజిక అసమానతలు ఆమెను మౌనంగా ఉండనివ్వలేదు. అన్యాయాలపై గొంతెత్తాలనే సంకల్పంతో 2002లో మావోయిస్టు ఉద్యమంలో చేరింది. చత్తీ్సగఢ్లోని నార్త్ బస్తర్ డివిజన్లో రూపి పేరుతో పార్థాపూర్ ఏరియా కమాండర్ స్థాయికి ఎదిగింది. అడవుల్లో మావోయిస్టు లు ఏర్పాటు చేసిన పాఠశాలను నిర్వహిస్తూ విద్యార్థులకు విప్లవ పాఠాలు బోధించింది. తండ్రి మరణించినప్పుడు కడసారి చూపుకు రాలేదు. ఆమెను లొంగిపోవాలని పోలీసులు అనేక సార్లు హెచ్చరించారు. తల్లి ఎల్లవ్వ సైతం ‘బిడ్డా.. కనీసం నా చితికి నిప్పు పెట్టడానికైనా తిరిగి రా’ అంటూ కన్నీరుమున్నీరైనా స్పందన కనిపించలేదు. గత నెలలో జరిగిన 2వేర్వేరు దాడుల నుంచి తప్పించుకుంది. కాం కేర్ ఆస్పత్రిలో పోస్టుమార్టం పూర్తయినట్లు కుటుంబసభ్యులకు పోలీసులు సమాచారమం దించారు. మంగళవారం సాయంత్రం మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకురానుండగా, బుధవారం అంత్యక్రియలు జరగనున్నాయి.